కోహ్లీని చూసి నేర్చుకోండి..
ఈ నేపథ్యంలో క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాన్ కిషన్ను కొనియాడిన సెహ్వాగ్.. అతనికి కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడు. 'తనదైన రోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పకుండా జట్టును గెలిపిస్తాడు. ఫార్మాట్ ఏదైనా చివరి వరకూ క్రీజులో ఉండి విజయాన్నందిస్తాడు. అతని బ్యాటింగ్లో అదో ప్రత్యేకత. ఈ విషయంలో పంత్, కిషన్.. కోహ్లీని చూసి నేర్చుకోవాలి. మీదైన రోజు ఔటవ్వకుండా ఆడాలి. చివరివరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించాలి. నాక్కూడా సచిన్ ఇదే విషయం చెప్పేవాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
సచిన్ కూడా నాకు ఇదే చెప్పేవాడు..
'ఈ రోజు నువ్వు బాగా ఆడుతున్నావని తెలిస్తే.. వీలైనంతసేపు క్రీజులో పాతుకుపో. చివరి వరకు పరుగులు చేస్తూ నాటౌట్గా మిగిలిపో. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. పరుగులు చేస్తావో లేదో చెప్పలేం. కానీ, నువ్వు బాగా ఆడే రోజు పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. దాంతో ఆ రోజు ఔటవ్వకుండా ఆడి పరుగులు సాధించాలి'' అని సచిన్ నాతో అనేవాడు'' అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు.
ఐపీఎల్ భ్రమలోనే..
ఇషాన్ ఇంకా ఐపీఎల్ భ్రమలోనే ఉన్నాడని.. అందుకే తన విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడని సెహ్వాగ్ తెలిపాడు. 'నాకు తెలిసి ఇషాన్ కిషన్ తాను ఆడుతుంది ఐపీఎల్ అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్ తరహా ప్రదర్శన చేయడం ఇషాన్కు మాత్రమే చెల్లింది. ఏ మాత్రం భయం లేకుండా అతను కొట్టిన ఒక్కో షాట్ ఐపీఎల్లో అతని ఆటతీరును గుర్తుచేసింది. కెరీర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నామంటే ప్రతీ ఒక్క ఆటగాడి మదిలో భయం ఉంటుంది. కానీ ఇషాన్లో అది కనపడలేదు. ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్న ఇషాన్.. ఐపీఎల్లో కూడా ఇలాంటి బౌలర్లనే ఎదుర్కొన్నాడు. అందుకే అతను అలా చెలరేగాడు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ధోనీతో పోల్చుతూ..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిక తెస్తూ ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్.. ఇషాన్ కిషన్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. 'జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువ కీపర్ బ్యాట్స్మెన్ తన సామర్థ్యమేమిటో నిరూపించుకున్నాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది (ఎంఎస్ ధోనీని ఉద్దేశించి). ఏమాత్రం బెదురు లేకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిన తీరు ఎంతగానో నచ్చింది' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మహీ స్వస్థలం జార్ఖండ్ అన్న సంగతి తెలిసిందే. ఇక దేశవాళీ క్రికెట్లో ఇషాన్ జార్ఖండ్కు ఆడుతున్నాడు. అందుకే వీరూ ఇలా ట్వీట్ చేశాడు.