
టీమిండియా బ్యాట్స్మన్, హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు బుధవారం అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీలు రాయుడు రిటైర్మెంట్పై స్పందించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. రాయుడు నువ్వు ఉన్నతమైన వ్యక్తివి' అంటూ కోహ్లీ తన ట్విటర్లో ఖాతాలో రాసుకొచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మరోవైపు టీమిండియా మాజీ ఓపెనర్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్.. రాయుడు రిటైర్మెంట్పై ఘాటుగా స్పందించాడు. 'సెలెక్షన్ కమిటీ ప్యానెల్లో ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సహా మొత్తం అయిదుమంది సభ్యులు క్రికెటర్లే. క్రికెట్లో ఈ అయిదు మంది చేసిన పరుగులన్నింటినీ కలుపుకొన్నప్పటికీ.. అంబటి రాయుడు చేసిన రన్స్కు సరి తూగవు. అలాంటి ఆటగాళ్లను సెలెక్షన్ కమిటీలో ఎలా నియమించారో అర్థం కావట్లేదు. అంబటి రాయుడు రిటైర్మెంట్ తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు, వారి వైఖరి వల్లే అంబటి రాయుడు అర్ధాంతరంగా తన కేరీర్ను ముగింపు పలికాడు' అని గంభీర్ పేర్కొన్నారు.
ప్రపంచకప్ జట్టు ఎంపికలో మొదటి నుంచీ స్థానం ఆశించిన రాయుడుని కాదని సెలెక్టర్లు విజయ్ శంకర్ని ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ అందుకు వివరణ ఇచ్చిన తర్వాత రాయుడిని రెండో స్టాండ్బై ఆటగాడిగా ప్రకటించారు. తొలుత శిఖర్ ధావన్ గాయం నుంచి తప్పుకోగా అతడికి బదులు రిషభ్ పంత్ను ఎంపిక చేశారు. అనంతరం విజయ్ శంకర్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. అతడి స్థానంలో యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రెండోసారీ కూడా రాయుడికి నిరాశే ఎదురైంది.
అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడని తెలుస్తోంది. అయితే సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడం వెనుక రాయుడు చేసిన ట్వీటే కారణమని అంతా భావిస్తున్నారు. తొలిసారి ప్రపంచకప్ జట్టుని ఎంపిక చేసినప్పుడు తనని కాదని విజయ్ శంకర్ని ఎంపిక చేయడం పట్ల రాయుడు వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.