గంగూలీ రికార్డు బ్రేక్
విరాట్ కోహ్లీ తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేయడంతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానానికి విరాట్ చేరుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసే క్రమంలో కోహ్లీ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. కెప్టెన్గా గంగూలీ 142 ఇన్నింగ్సులలో 5,082 పరుగులు చేయగా.. కోహ్లీ 83 ఇన్నింగ్స్లలో 5,123 పరుగులు చేసాడు.
అగ్రస్థానంలో ధోనీ
సారధిగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మాజీ కెప్టెన్లు మహ్మద్ అజహరుద్దీన్ 5,239 (162 ఇన్నింగ్స్), ఎంఎస్ ధోనీ 6,641 (172 ఇన్నింగ్స్) కోహ్లీ కంటే ముందున్నారు. విరాట్ ఫామ్ చూస్తే.. ధోనీని అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదనిపిస్తోంది. మరో 20 ఇన్నింగ్సులలోమహీని వెనక్కి నెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. అత్యంత నిలకడగా ఆడుతూ రికార్డులు బద్దలు చేయడం కోహ్లీకి అలవాటే.
కోహ్లీ సంచలనాలు
అద్భుత బ్యాటింగ్, నాయకత్వ లక్షణాలతో అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ సంచలనాలు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీలు, టీ20ల్లో 2,794 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ కూడా కోహ్లీనే.
టీ20 ఫార్మాట్లో సెంచరీ లేదు
ఇక వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 శతకాలతో మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 70 శతకాలు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్ (71)ల తర్వాత స్థానం కోహ్లీదే. అయితే కోహ్లీ సెంచరీ చేసి చాలాకాలమే అయ్యింది. గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్తో కోల్కతాలో జరిగిన టెస్టు మ్యాచ్లో సెంచరీ సాధించిన కోహ్లీ .. వన్డేల్లో మాత్రం ఆగస్టులో విండీస్పై శతకం సాధించాడు. ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్లో విరాట్ సెంచరీ చేయలేదు.