న్యూ ఢిల్లీ: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఓవర్ నైట్ 250/9 స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించింది టీమిండియా. బ్యాటింగ్కు దిగిన షమీ తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఇలా రెండో రోజైన శుక్రవారం భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులకి ఆలౌటవగా.. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ను నిలకడగానే ఆరంభించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ భారత్కి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు.
తొలి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ.. మూడో బంతికే ఆ జట్టు ఓపెనర్ అరోన్ ఫించ్(0: 3 బంతుల్లో)ని క్లీన్బౌల్డ్ చేశాడు. ఆఫ్ స్టంప్కి వెలుపలగా పడిన బంతిని డ్రైవ్ చేసేందుకు అరోన్ ఫించ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్కి ఎడ్జ్ తీసుకున్న బంతి.. నేరుగా వెళ్లి ఆఫ్, మిడిల్ స్టంప్లను గిరాటేసింది. ఎంతలా అంటే.. ఆ రెండు స్టంప్స్ గాల్లోకి విసురుగా ఎగిరి దూరంగా పడిపోయాయి. అది చూసిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆనందంతో గాల్లో పంచ్లిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
The stumps went flying as Ishant Sharma gave India the perfect start with the ball.#AUSvIND | @bet365_aus pic.twitter.com/f7bg9MPGWd
— cricket.com.au (@cricketcomau) December 7, 2018
ఆస్ట్రేలియా ప్రధాన వికెట్ కోల్పోవడంతో టీమిండియా సంబరాలకు హద్దు లేకుండాపోయింది. వన్డే, టీ20ల్లో హిట్టర్గా పేరున్న ఆరోన్ ఫించ్ క్రీజులో కుదురుకుంటే మాత్రం నిలువరించడం ప్రత్యర్థులకి కష్టమేనని రికార్డులు చెప్తున్నాయి. ఫార్మాట్ ఏదైనా.. అతని ఆట తీరు మాత్రం ఒకే తరహాలో ఉంటుంది. మ్యాచ్ ఆరంభంలోనే అతడ్ని ఔట్ చేయడం ద్వారా భారత్ జట్టు ఆసీస్ జోరుకి కళ్లెం వేసినట్లయింది.
తొలి రోజు ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రాణించిన పూజారా మాట్లాడుతూ.. 'కసితో ఆడా. ఇలా ఒక దశలో మంచి నీళ్లు కూడా తాగాలనుకోలేదు. నా టెస్టు కెరీర్లో అత్యుత్తమ టెస్టుల్లో ఇదొకటి. తొలి టెస్టు ఇన్నింగ్స్లో చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని రెండో ఇన్నింగ్స్లో రాణించాలని భావిస్తున్నాం' అని తెలిపాడు.