అచ్చం గంగూలీలానే కోహ్లీ:
తాజాగా క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ నాయకత్వం గురించి, యువ క్రికెటర్ల పాత్ర గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ అచ్చం సౌరవ్ గంగూలీలా ఉంటాడు. యువకులకు ఎప్పుడూ అండగా నిలుస్తాడు. దాదాలోని ఆ ప్రత్యేకత కోహ్లీలో ఉంది. విరాట్ తన పరిధి దాటి మరీ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. అందుకు రిషభ్ పంత్ ఓ ఉదాహరణ. ఇటీవల పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అతడి విషయంలో కోహ్లీ ఎంతో అండగా నిలిచాడు. అవన్నీ ప్రెస్మీట్లలో కూడా మనం చూశాం' అని ఇర్ఫాన్ తెలిపాడు.
ఎంతో మంది క్రికెటర్లు కనుమరుగయ్యారు:
'అండర్ 19 ప్రపంచకప్ తర్వాత ఎంతో మంది క్రికెటర్లు కనుమరుగయ్యారు. వాళ్లకి జాతీయ జట్టులో రాణించే సత్తా ఉన్నా.. అంతర్జాతీయ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. అండర్ 19 క్రికెటర్లు కొందరు టీమిండియాకు కూడా ఆడతారు. అయితే ఆ రెండింటి మధ్య ఫస్ట్క్లాస్ క్రికెట్ ఉంటుంది. అక్కడే ఆటలో మరింత మెరుగవ్వడమే కాకుండా పెద్ద పోటీల్లో ఆడే శక్తిసామర్థ్యాలు సాధించాలి. అండర్ 19, ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఉన్న కాంపిటిషన్ లెవెల్ అంతర్జాతీయ క్రికెట్లో ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకుంటూ మానసిక పరిపక్వతను కూడా సాధించాలి. అదే అన్నిటికన్నా ముఖ్యం' అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
పేసర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి:
'సాధారణంగా ఏ దేశ క్రికెట్ జట్టుకైనా కేవలం 2 నుంచి 3 వారాల సెలవు మాత్రమే దొరుకుతుంది. కానీ వైరస్ కారణంగా ఆటగాళ్లకు దాదాపు 4 నెలల విశ్రాంతి దొరింకింది. ఈ 3-4 నెలలూ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆటగాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే స్పిన్నర్లు, బ్యాట్స్మెన్లు 3 వారాల సమయంలో తిరిగి ఫిట్నెస్ సాధించగలుగుతారు. కానీ ఫాస్ట్ బౌలర్లు అలాకాదు. ఫాస్ట్ బౌలర్లు 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుంటారు. అలాంటి వారు ఇన్ని నెలలు ఖాళీగా ఉండడంతో శరీరం సహకరించదు. ఒక్కసారిగా ప్రాక్టీస్ చేయడంతో గాయాలపాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేకాకుండా వారు మునుపటి స్థాయిని అందుకునేందుకు కనీసం 4 నుంచి 6 వారాలు అవసరం కావచ్చు. అందువల్ల పేసర్లందరూ జాగ్రత్తగా ఉండాలి' అని ఇర్ఫాన్ సలహా ఇచ్చాడు.