విలియమ్సన్పై స్లెడ్జింగ్..
కివీస్ తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ మూడు పరుగులకే ఔటయ్యాడు. అయితే విలియమ్సన్కు సెండాఫ్ ఇస్తూ, కోహ్లీ చాలా కోపంగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు. చూపుడు వేలిని చూపిస్తూ, ఏవో అసభ్య పదాలను వాడాడు. దీనిపై ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ చేష్టలు తీవ్ర అసంతృప్తికి లోను చేశాయని, అతనికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.
జడేజా కళ్లు చెదిరే క్యాచ్.. సూపరో సూపర్..!(వీడియో)
ప్రేక్షకుల వైపు అసభ్య సంజ్ఞ..
ఇక మహ్మద్ షమీ బౌలింగ్లో టామ్ లాథమ్ ఔటవ్వగా.. తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కోహ్లీ.. ప్రేక్షకుల వైపు తిరగుతూ.. నోరు మూసుకోవాలి అన్నట్లు సైగ చేశాడు. అంతేకాకుండా రాయలేని బూతు పదాలు ఉపయోగించినట్లు అతని లిప్ సింక్ చూస్తే అర్థమవుతోంది. మైదానంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. క్రీడా స్పూర్తిని మరిచి ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస వైఫల్యాలను తట్టుకోలేకపే కోహ్లీ సహనం కోల్పోతున్నాడని మండిపడుతున్నారు.
న్యూజిలాండ్ గడ్డపై తేలిపోయిన కోహ్లీ..
న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ సుదీర్ఘ పర్యటనలో హామిల్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 51 పరుగులు మినహా మరే మ్యాచ్లో కోహ్లీ కనీసం 20 పరుగులు చేయలేకపోయాడు. ఈ పర్యటనలో 11 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. మొత్తం 218 పరుగులు చేశాడు. నాలుగు టీ20ల్లో 45,11,38,11 చొప్పున పరుగులు చేశాడు. మూడు వన్డేల్లో 51, 15, 9 చొప్పున వరసగా పరుగులు సాధించాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 2, రెండో ఇన్నింగ్స్లో 19 పరుగులు చేశాడు. ఇక రెండోటెస్టులో తొలి ఇన్నింగ్స్లో పేలవరీతిలో 3 పరుగులకే ఔటైన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులకే పరిమితయ్యాడు. ఫలితంగా తన కెరీర్లో మూడు ఫార్మాట్లు ఆడిన ఓ పర్యటనలో అతి తక్కువ పరుగులు చేసిన అపప్రదను మూటగట్టుకున్నాడు.
తన కెరీర్లోనే అత్యంత దారుణ పర్యటనగా చెప్పుకునే 2014 ఇంగ్లండ్ టూర్ కన్నా తాజా పర్యటనలో కోహ్లీ అధ్వాన్నంగా ఆడాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో మొత్తం 258 పరుగులు చేయగా... ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో అంతకంటే తక్కువ పరుగులతో చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అద్భతం జరిగితేనే..
7 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. ట్రెంట్ బోల్ట్ (3/12) ధాటికి కుదేలైంది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో పంత్(1 బ్యాటింగ్), విహారి(5 బ్యాటింగ్) ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లకు తోడుగా.. గ్రాండ్హోమ్, వాగ్నర్,సౌతీలు తలో వికెట్ పడగొట్టారు.
ప్రస్తుతం భారత్ 97 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో పంత్, విహారీ, లేక బౌలర్లు అద్భుతం చేస్తే తప్పా భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. ఇక అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ఓవర్నైట్ స్కోర్ 63/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్.. మహ్మద్ షమీ (4/81), జస్ప్రీత్ బుమ్రా (3/62) ధాటికి 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.