మెడలో రింగ్ను.. గాల్లోకి ముద్దులతో..
కోహ్లీ.. ఇంగ్లాండ్ గడ్డపై చేసిన సెంచరీ కావడంతో ప్రత్యేక సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ బంతిని పాయింట్ దిశగా బౌండరీ దాటించి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి స్టేడియంలో ఉన్న అనుష్క శర్మ వైపు తిరిగి తన మెడలో ఉన్న రింగ్ను తీసి ముద్దాడాడు. బ్యాట్తో గాల్లోకి ముద్దులు విసిరి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గతంలో అతనిని విమర్శించిన గడ్డపైనే సెంచరీ చేయడంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
|
54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి
తొలి టెస్టు రెండో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ జట్టు 287 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్ (20), శిఖర్ ధావన్ (26) కాసేపు మాత్రమే క్రీజులో నిలిచారు. జట్టు స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి స్వింగ్ను, సీమ్ను జాగ్రత్తగా గమనిస్తూ పోరాటాన్ని కొనసాగించాడు. పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు.
పాండ్య (22)తో కలిసి స్కోరు బోర్డుని నడిపించి..
కోహ్లీకి ఎవరి నుంచి పెద్దగా సహకారం లభించలేదు. కేఎల్ రాహుల్ (4), అజింక్య రహానె (15), దినేశ్ కార్తీక్ (0) నిరాశపరచడంతో భారత్ చూస్తుండగానే 100/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఈ దశలో హార్దిక్ పాండ్య (22)తో కలిసి కాసేపు స్కోరు బోర్డుని నడిపించిన కోహ్లి.. అనంతరం అశ్విన్ (10), ఇషాంత్ శర్మ (5)ల సాయంతో సెంచరీకి చేరువయ్యాడు. కోహ్లి 90లోకి వచ్చినప్పుడు ఇషాంత్ ఔటైనా.. అనంతరం వచ్చిన ఉమేశ్ యాదవ్ (1) చక్కటి సహకారం అందించాడు.
10 ఇన్నింగ్స్లో కలిసి మొత్తం 143 పరుగులే
ఇన్నింగ్స్ 65వ ఓవర్ వేసిన బెన్స్టోక్స్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లి.. ఇంగ్లాండ్ గడ్డపై తన చిరకాల సెంచరీని స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2014 పర్యటనలో కోహ్లి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. 2014 పర్యటనలో 10 ఇన్నింగ్స్లో కలిసి మొత్తం 143 పరుగులే చేసిన కోహ్లి.. తాజాగా ఒక ఇన్నింగ్స్లోనే అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం కొసమెరుపు. టీమిండియా 274 పరుగులకి ఆలౌటవడంతో 13 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇంగ్లాండ్కి లభించింది.