బెంగళూరు: ఈ ఏడాది ఆరంభం అయ్యే ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లల్లో భారత కేప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రమాదకారి బ్యాట్స్ మన్ గా మారుతాడని, అతణ్ని అంత సులభంగా ఎవరూ పెవిలియన్ దారి పట్టించలేరని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ విరాట్ కోహ్లీని దగ్గరి నుంచి చూశానని, అతనిది ఓటమిని అంత త్వరగా అంగీకరించే మనస్తత్వం కాదని చెప్పారు. తనలాగే విరాట్ కూడా ఓ యోధుడని కితాబిచ్చాడు. ఈ సారి ప్రపంచకప్ లో విరాట్ కొరకరాని కొయ్య అవుతాడని చెప్పారు.
ఈ ఏడాది మేలో ప్రపంచకప్ క్రికెట్ ఆరంభం అవుతోన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ మే 30వ తేదీన జరుగనుంది. ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ కు ఈ సారి ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొనడానికి అన్ని దేశాల క్రికెట్ జట్లు సమాయాత్తమౌతున్నాయి. ఈ ప్రపంచ కప్ లో అందరికంటే అత్యంత ప్రమాదకారి బ్యాట్స్ మెన్ విరాట్ మాత్రమేనని ఏబీ డివిలియర్స్ చెప్పారు. సమాకాలీన బ్యాట్స్ మెన్లలో చాలామందిలో నైపుణ్యం ఉన్నప్పటికీ.. నిలకడ లోపించిందని అభిప్రాయపడ్డారు. విరాట్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడని అన్నారు. ప్రపంచకప్ మ్యాచ్ లల్లో విరాట్ ను అవుట్ చేయడానికి ఏ జట్టుకైనా సరికొత్త వ్యూహాలను రచించుకోవాల్సి ఉంటుందని ఏబీ డీ చెప్పారు.
కోహ్లీ ఆడితే భారత్ వరల్డ్కప్ గెలుస్తుంది: పాంటింగ్ No. 4 ఎవరో తెలుసా?
తనలాగే విరాట్ కూడా ఓటమిని అంత త్వరగా అంగీకరించే మనస్తత్వం కాదని, ఓటమి కోరల్లో ఉన్నప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చే సత్తా ఉందని ప్రశంసించారు. తామిద్దరం బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తామని, ఎలాంటి బౌలర్లనైనా ఎదుర్కొనడానికి ఉత్సాహం చూపుతామని అన్నారు.
ఆ నాలుగు జట్లే హాట్ ఫేవరేట్స్..
వచ్చే ప్రపంచకప్ లో నాలుగు జట్లు మాత్రమే హాట్ ఫేవరేట్లుగా బరిలో ఉన్నాయని ఏబీ డివిలియర్స్ చెప్పారు. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు మాత్రమే కప్పును కొట్టగల సత్తా ఉందని అన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల లైనప్ అత్యంత బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే- సొంత గడ్డపై ఆడుతున్నందున ఇంగ్లండ్ ను అంత తేలిగ్గా తీసుకోకూడదని అన్నారు. ఇక- ఆస్ట్రేలియా కూడా తక్కువేమీ కాదని, ఇటీవలి కాలంలో ఆ జట్టు ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ.. అయిదుసార్లు ప్రపంచకప్ ను సొంతం చేసుకున్న విషయాన్ని విస్మరించ కూడదని చెప్పారు. అత్యంత క్లిష్ట పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ఆసీస్ జట్టుకు ఉందని చెప్పారు. రెండేళ్ల కిందట యూకేలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకున్న పాకిస్తాన్ కూడా బలమైన జట్టేనని అన్నారు. యూకే గడ్డపై ఆడి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడం వల్ల ఇక్కడి పిచ్ లన్నీ పాకిస్తాన్ కు బాగా పరిచయమైనవని చెప్పారు. పరిస్థితులకు తగ్గట్టుగా పాకిస్తాన్ ఆడుతుందని అన్నారు.