బ్యాటింగ్ వైఫల్యమే..
'ఈ పిచ్ బాగుంది. ఐడియల్ టెస్ట్ పిచ్ కాదన్న మాజీల వ్యాఖ్యలు అర్థరహితం. మంచి బంతులు మ్యాచ్ను టర్న్ చేశాయి. నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదు. 100/3తో ఉన్న మేం 150 లోపు ఆలౌటయ్యాం. రెండు జట్ల బ్యాట్స్మెన్ శక్తి మేరకు ఆడలేదు. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగానే ఉంది. 30లో 21 వికెట్లు స్ట్రెయిట్ బాల్స్కు పడటం విస్మయపరిచింది. మన డిఫెన్స్పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్ త్వరగా ముగిసింది. ఇదంతా స్పిన్నర్ల చలువే.' అని కోహ్లీ అన్నాడు.
ఎంత పొగిడినా తక్కువే..
మ్యాచులో కీలకంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'జడేజాకు గాయమైనప్పుడు చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్షర్ పటేల్ వచ్చాడు. వేగంగా కొంచెం హైట్గా బంతులు విసిరాడు. వికెట్ సహకరించిందంటే అక్షర్ అత్యంత ప్రమాదకరంగా మారగలడు. మనం అశ్విన్ ఘనతనూ గుర్తించాల్సి ఉంది. టెస్టు ఫార్మాట్లో ఆధునిక క్రికెట్లో అతడో దిగ్గజం. అతడు నా జట్టులో ఉండటం కెప్టెన్గా ఆనందిస్తాను. ఓ కెప్టెన్గా టీమ్ను చూసి గర్వపడుతున్నా' అని విరాట్ అన్నాడు. అశ్విన్ 77 టెస్టుల్లోనే 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్గా గుర్తింపు పొందాడు.
రెండు రోజుల్లోనే..
స్పిన్నర్ల హవా నడిచిన ఈ డే/నైట్ టెస్ట్లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్ శర్మ (25 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అక్షర్ పటేల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.