ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సాలా కప్ నమ్దే అనేలా సాగుతోందా జట్టు ప్రదర్శన. ఇదివరకెప్పుడూ లేనివిధంగా అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యాన్ని చలాయిస్తోంది కోహ్లీసేన. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యేకించి గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్పై కళ్లు చెదిరే విజయాన్ని సాధించింది. ఓటమి అనేదే లేకుండా టోర్నమెంట్లో దూసుకెళ్తోంది. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో పాతుకునిపోయింది.
కోహ్లీ కృష్ణావతారం: పడిక్కల్కు హితోపదేశం: 90 ప్లస్ భయాన్ని పోగొట్టుకోవడానికి ఏం చెప్పాడంటే..?
ముంబై వాంఖెడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ను కోహ్లీసేన ఏకపక్షంగా మార్చివేసింది. 177 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే.. కొండంత టార్గెట్ను ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 177 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు శివమ్ దుబే-46, రాహుల్ తెవాతియా-40, రియాన్ పరాగ్-25, సంజుశాంసన్-21 పరుగులు చేశారు. అనంతరం ఇన్నింగ్ ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ టీమ్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది.
బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్ ఇద్దరే టార్గెట్ను ఛేదించేశారు. క్రీజ్లోకి దిగే అవకాశాన్ని మరో బ్యాట్స్మెన్కు ఇవ్వలేదు. ఈ క్రమంలో పడిక్కల్.. తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 52 బంతులలో 101 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ సీజన్లో తన ఫుల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు కోహ్లీ. కేప్టెన్గా, బ్యాట్స్మెన్గా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు. రాజస్థాన్పై అర్థసెంచరీని నమోదు చేశాడు. 47 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 72 పరుగులు సాధించాడు. తన అర్థసెంచరీని కుమార్తె వామికాకు అంకితం చేశాడతను.
క్రిస్ మోరిస్ వేసిన 13వ ఓవర్ రెండో బంతిని మిడాన్ వైపు ఆడి సింగిల్ చేశాడు. దీనితో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ అందుకున్న తొలి అర్థసెంచరీ ఇది. 50 పరుగులు పూర్తయిన వెంటనే డగౌట్లో కూర్చున్న బెంగళూరు టీమ్ మెంబర్లు కోహ్లీని అభినందిస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ వెంటనే కోహ్లీ కూడా రెస్పాండ్ అయ్యాడు. డగౌట్లో ఉన్న భార్య అనూష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అనంతరం తన కుమార్తెను ఎత్తుకుని ఆడిస్తున్నట్టుగా ఫోజిచ్చాడు. తన అర్థసెంచరీని కుమార్తెకు డెడికేట్ చేస్తున్నట్లు సంకేతాన్ని పంపించాడతను.
Virat Kohli Dedicates His Fifty To
— Virat Fan Trends™ (@ViratFanTrends) April 22, 2021
His Daughter ‘Vamika’ 😍@imVkohli • @AnushkaSharma pic.twitter.com/R4HLg7xg1i