న్యూఢిల్లీ: భారత్-పాక్ ఆటగాళ్లు ఆన్ ఫీల్డ్లో ఎంత పోటాపోటీగా తలపడినా ఆఫ్ ఫీల్డ్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లమని టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తెలిపాడు. పాకిస్థాన్లో తనకు ఓ వీరాభిమాని ఉన్నాడని అతను రషీద్ లతీఫ్తో లెటర్స్ పంపించే వాడని 'గ్రేటెస్ట్ రైవల్రీ పాడ్కాస్ట్'లో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు.
ఇక పాకిస్థాన్ జట్టులో కూడా తనకు మిత్రులు ఉన్నారని చెప్పిన కాంబ్లీ.. భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లినప్పుడల్లా మంచి ఆతిథ్యం లభించేదన్నాడు. 'పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ప్రతీసారి మాకు మంచి ఆతిథ్యం లభించేది. ఇక అక్కడ నాకో అభిమాని ఉన్నాడు. నేను 1991లో భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి అతను నన్ను ఫాలో అవుతున్నాడు.
మొబైల్ ఫోన్లు లేని ఆ కాలంలో అతను నాకు లేఖలు పంపేవాడు. తన భావాలను వాటిలోనే వ్యక్తపరిచేవాడు. రషీద్ లతీఫ్తో వాటిని నాకు అందజేసేవాడు. ఆ అభిమాని పాక్ క్రికెటర్ వద్దకెళ్లి నాకు ఆ లేఖలు ఇవ్వమని చెప్పేవాడు. అలా అవి నా వరకు చేరేవి. ఇప్పటికీ పాకిస్థాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది' అని కాంబ్లీ చెప్పుకొచ్చాడు.
అలాగే తనకు వకార్ యూనిస్, వసీం అక్రమ్తో పాటు మిగతా ఆటగాళ్లతో స్నేహం ఉందన్నాడు. అది ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పాడు. ఇక భారత్ తరఫున 104 వన్డేలు ఆడిన కాంబ్లీ 2477 రన్స్ చేశాడు. ఇక పాకిస్థాన్పై 19 మ్యాచ్ల్లో 354 పరుగులు చేయగా.. అందులో 65 అత్యధికం.
గంభీర్పై మరోసారి నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రిది!