మాధవ్ కౌశిక్ శతకం:
ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్ప్రదేశ్.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అక్షదీప్నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకాలు చేయడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ, సమీర్ చౌదరీలు తలో వికెట్ తీశారు.
తారే సెంచరీ:
అనంతరం లక్ష్య ఛేదనలో పృథ్వీ షా (73), ఆదిత్య తారే (118 నాటౌట్) చెలరేగడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (29), శివమ్ దూబే (42), శామ్స్ ములానీ (36) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో యూపీ బౌలర్లు విఫలమయ్యారు. తనుశ్ కోటియన్ 2, ప్రశాంత్ సోలంకీ ఒక వికెట్ సాధించారు.
ట్రోఫీలో అత్యధిక స్కోర్:
సీజన్లో పృథ్వీ షా బ్యాటింగ్ హైలెట్గా నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు షా ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఈ క్రమంలోనే షా దేశవాళి క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్ హజారె ట్రోఫీలో ఒకే సీజన్లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఒకే సీజన్లో షా 827 పరుగుల అత్యధిక స్కోర్ సాధించాడు. 2018లో కర్ణాటక తరఫున మయాంక్ అగర్వాల్ సాధించిన 723 పరుగులే ఇదివరకు ఈ ట్రోఫీలో అత్యధిక స్కోర్గా నమోదైంది. ముంబై కెప్టెన్ పృథ్వీ షా (825), కర్ణాటక బ్యాట్స్మన్ దేవ్దత్ పడిక్కల్ (725).