లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్నా ప్రత్యర్థులకు చుక్కలే. వారి పరుగుల విధ్వంసానికి బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించాల్సిందే. అలాంటిది కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కలిసి వింజృంభిస్తే.. పరుగులు సునామే. వారు అలా చెలరేగుతుంటే ఏ ప్రత్యర్థి కెప్టెన్ అయినా సహచరులతో చర్చించి వారిని విడదీయడానికి ప్రయత్నిస్తాడు. అందుకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేస్తాడు.
అయితే కోహ్లీ-రోహిత్ విధ్వంసంతో ఏం చేయాలో అర్థంకానీ ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాత్రం అంపైర్ మైకేల్ గాఫ్ సలహా అడిగాడంట. ఈ విషయాన్ని ఆ అంపైర్ గాఫే తాజాగా వెల్లడించాడు. 'భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఒకటి గుర్తొస్తోంది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. నేను స్క్వేర్లెగ్లో ఫించ్ పక్కన నిలబడి అంపైరింగ్ చేస్తున్నా. అప్పుడతను ఆ ఇద్దరు గొప్ప ఆటగాళ్లను చూడకుండా ఉండేదెలా? అని నన్నడిగాడు. నేనెలా వారికి బౌలింగ్ చేయించాలి? అని మళ్లీ ప్రశ్నించాడు. దాంతో 'నాకు చేతి నిండా పనుంది. నీ పని నీకుంది' అని జవాబిచ్చా' అని గాఫ్ గుర్తు చేసుకున్నాడు.
అయితే గాఫ్ చెప్పిన ఆ మ్యాచ్ ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన మూడో వన్డేగా భావిస్తున్నారు. ఈ పోరులో రోహిత్ (119), కోహ్లీ (89) రెండో వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో టీమిండియా 286 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్ల తేడాతో ఛేదించింది. ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన గాఫ్ ఇప్పటి వరకు 62 వన్డేలకు అంపైరింగ్ చేశారు. 2019, 2020లో భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీసులకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడిన గాఫ్.. ఆఫ్ స్పిన్నర్గా 30 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 21 వికెట్లు తీశాడు.
కొడుకు చేతిలో హత్యకు గురైన మాజీ క్రికెటర్