హైదరాబాద్: రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి.. డీఎస్పీ అవడమే టార్గెట్గా సాధించిన భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్కు ఇప్పుడు ఆ ఉద్యోగం దూరం కానుంది. ఎందుకంటే.. ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందట. దీంతో ఆమె తన పోలీసు ఉద్యోగాన్ని కోల్పోనున్నట్లు సమాచారం. గతేఏడాది ఇంగ్లాండ్లో జరిగిన మహిళల ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ అద్భుత ప్రదర్శన చేసినందుకుగాను పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.
డీఎస్పీ ఉద్యోగంలో చేరే సమయంలోనూ హర్మన్కు కొన్ని అంతరాయాలు ఎదురైయ్యాయి. రైల్వే అధికారిగా ఆమె కాంట్రాక్టు ముగియలేదని.. మరో రెండు సంవత్సరాల ఒప్పందం ఉందని అన్నారు. విషయం తెలుసుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వయంగా కలగజేసుకుని కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. దీంతో ఆమెకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత వెంటనే ఆమె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది.
Harmanpreet Kaur likely to lose Punjab Police job due to fake degree: Reports https://t.co/SEujqFfyAF
— myKhel.com (@mykhelcom) July 2, 2018
ఆ సమయంలో కొన్ని సర్టిఫికెట్లను ప్రభుత్వానికి అందజేసింది. మీరట్లోని చౌదరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లుగా అందులో ఉంది. ప్రభుత్వ అధికారుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టగా ఆ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు ఎక్కడా తేలలేదు. దీంతో వారు తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు.
దీనిపై హర్మన్ప్రీత్ మాట్లాడుతూ...'ఇదంతా మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. అంతా అబద్ధం. నా డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడిన అనంతరం మీతో మాట్లాడతా' అని హర్మన్ మీడియాకు తెలిపింది. గతంలోనూ పంజాబ్ ప్రభుత్వానికి ఇలాంటి సమస్యే ఎదురైంది. 2010 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి మణ్దీప్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాన్ని కట్టబెట్టింది. అప్పుడు కూడా ఆమె నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించినట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం.