హైదరాబాద్: అఫీఫ్ హుస్సేన్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ (32 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ మసకద్జా (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫరవాలేదనిపించాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం, సైపుద్దీన్, రెహ్మాన్, హుస్సేన తలో వికెట్ తీసుకున్నారు. కాగా, బంగ్లా కెప్టెన్ షకీబ్ వేసిన ఓ ఓవర్లో బర్ల్ వరుస బౌండరీలతో 30 పరుగులు రాబట్టాడు. అనంతరం 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.
తాజా విజయంతో ముక్కోణపు టీ20 సిరిస్లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. బంగ్లా బ్యాటింగ్లో 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో అఫీఫ్ హుస్సేన్ (26 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్ చేయగా... మొసద్దిక్ హుస్సేన్ (24 బంతుల్లో 30 నాటౌట్; 2 సిక్సర్లు) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.