క్రైస్ట్చర్చ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టులో పుంజుకునేందుకు ప్రయత్నిస్తాడని న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తెలిపాడు. పరిస్థితులు అనుకూలిస్తే క్రైస్ట్చర్చ్లో ఈ రన్ మిషెన్ను అడ్డుకునేందుకు ఆఫ్సైడ్ ఆఫ్స్టంప్ బంతులతో దాడి చేస్తామని తమ వ్యూహాలను వెల్లడించాడు. స్వింగ్కు అనుకూలించే పిచ్లపై కోహ్లీ ఆఫ్సైడ్ ఆఫ్స్టంప్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. స్లిప్ లేదా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరుతున్నాడు. దీంతో ఆ బంతులతో మరోసారి భారత కెప్టెన్పై దాడి చేస్తామని లాథమ్ చెప్పుకొచ్చాడు. ఇక తొలి టెస్టులో విరాట్ 2, 19 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు.
'విరాట్ క్రీజులోకి రాగానే మేం సిద్ధంగా ఉంటాం. అతడో అద్భుతమైన ఆటగాడు. చాలారోజులు ప్రపంచ నంబర్వన్ ర్యాంకులో కొనసాగాడంటే అందుకు అతడి నిలకడైన బ్యాటింగే కారణం. అన్ని దేశాల్లో విభిన్న పరిస్థితుల్లో కోహ్లీ రాణించాడు. క్రైస్ట్చర్చ్లో పరిస్థితులు స్వింగ్కు అనుకూలిస్తే ఆఫ్సైడ్ బంతులతో మేం దాడిచేస్తాం'అని లాథమ్ తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో కూడిన భారత బౌలింగ్ ప్రపంచ స్థాయిలో ఉందని కొనియాడాడు.
'తొలి టెస్టులో మేం వాళ్లని చక్కగా ఎదుర్కొన్నాం. బుమ్రా, షమీ వరల్డ్క్లాస్ పేసర్లు. వారి బౌలింగ్లో ఆడటం మాకు కొంచెం ఇబ్బందే. వాళ్లు కచ్చితంగా కట్టడి చేస్తారని తెలుసు. అందుకే బాగా ఆడితేనే మాకు అవకాశాలు ఉంటాయి. సుదీర్ఘంగా మేం బ్యాటింగ్ చేసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలి. నీల్ వాగ్నర్ అద్భుతమైన పేసర్. అతడు జట్టులో చేరడంతో మా బలం మరింత పెరిగింది. బౌన్స్కు సహకరించే హెగ్లే ఓవల్ మైదానంలో అతడెంతో కీలకం. కాస్త పొట్టిగా ఉండటంతో బ్యాటర్లకు ఆడటం కష్టంగా ఉంటుంది. పచ్చిక పిచ్ కాబట్టి ఆటలో తొలిరోజే కీలకం. అక్కడ మేం ఒకేఒక టెస్టు ఓడాం. మాకు ఇష్టమైన మైదానాల్లో అదొకటి' అని లాథమ్ చెప్పుకొచ్చాడు.