ఫైనల్ దాకా చేరుకుని..
1983 జూన్ 25వ తేదీన లండన్ లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ ను ఓడించింది కపిల్ డెవిల్స్ టీమ్. అప్పట్లో వన్డే మ్యాచ్ లో 55 ఓవర్లు ఆడేవారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ టీమ్ 52 ఓవర్లలో 140 పరుగులకు చాప చుట్టేసింది. నిజానికి 184 పరుగుల లక్ష్యం వెస్టిండీస్ ఏ మాత్రం భయపెట్టలేనిదే. ఊది అవతల పడేసే స్కోరే. ఫైనల్ లో అడుగు పెట్టిన తరువాత- కప్పు గెలిచి తీరాలనే తాపత్రయం భారత క్రికెట్ జట్టును ఆవహించింది. ఫైనల్ దాకా చేరుకుని ఒట్టి చేతులతో తిరుగు ముఖం పట్టకూడదని భావించారు భారత క్రికెటర్లు. సర్వ శక్తులను ఒడ్డి మ్యాచ్ ను గెలిచారు. వెస్టిండీస్ వంటి జట్టును, అదీ ఫైనల్ మ్యాచ్ లో 140 పరుగులకే ఆలౌట్ చేసిందంటే.. బౌలర్ల ఎంతగా శ్రమించారో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచకప్ 2019: రికార్డులన్నీ కొల్లగొట్టేశాడు!
టీమిండియా బౌలింగ్ ముందు తేలిపోయిన విండీస్ బ్యాట్స్
గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, సర్ వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, లారీ గోమ్స్, జెఫ్ డూజాన్ వంటి అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిండీస్ జట్టుపై చెలరేగిపోయింది. అసాధారణ పోరాట ప్రతిమను చూపింది. కపిల్ దేవ్, మదన్ లాల్, మొహిందర్ అమర్ నాథ్ ల నుంచి వెలువడిన బంతులకు విండీస్ బ్యాట్స్ మెన్ల వద్ద సమాధానమే లేకుండాపోయింది. ఫైనల్ మ్యాచ్ లో 11 ఓవర్లు వేసిన కపిల్ దేవ్ కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒక వికెట్ ను పడగొట్టారు. మొహిందర్ అమర్ నాథ్ ఏడు ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడు వికెట్లను పడగొట్టాడు. ఏ ఒక్క బౌలర్ కూడా ఓవర్ కు నాలుగు పరుగులు చొప్పున సమర్పించుకోలేదు. వెస్టిండీస్ ను ఓడించి తీరాలనే తపన బౌలర్లలో ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థ: చేసుకోవచ్చు.
వంద మీటర్ల దూరం నుంచి క్యాచ్..
1983 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచారు. 28 బంతుల్లో ఏడు ఫోర్లతో 33 పరుగులు చేశాడు రిచర్డ్స్. మదన్ లాల్ బౌలింగ్ లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. రిచర్డ్స్ వికెట్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. మదన్ లాల్ విసిరిన బంతిని భారీ షాట్ ఆడాడు రిచర్డ్స్. బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న కపిల్ దేవ్ సుమారు వంద మీటర్ల దూరం వరకు పరుగెత్తుకుంటూ వచ్చి.. ఆ క్యాచ్ ను అందుకున్నాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రపంచకప్ టోర్నమెంట్లకూ ఈ క్యాచ్ హైలైట్. దీని గురించి చాలామంది చాలాసార్లు చెప్పుకొన్న క్యాచ్ అది. తనకు ఆ సమయంలో బంతి కనిపించలేదని, ప్రపంచకప్ కనిపించిందని కపిల్ దేవ్ చాలాసార్లు చెప్పుకొన్నారు.
భారత్ ఇన్నింగ్ శ్రీకాంత్ ఒక్కడే టాప్ స్కోరర్..
టీమిండియా ఇన్నింగ్ లో డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఒక్కడే టాప్ స్కోరర్. 57 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 38 పరుగులు చేశాడు. మాల్కమ్ మార్షల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్, లెజెండరీ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. మొహిందర్ అమర్ నాథ్ 26, మిడిలార్డర్ లో యశ్ పాల్ శర్మ 11, సందీప్ పాటిల్ 27, కపిల్ దేవ్ 15, టెయిలెండర్లలో మదన్ లాల్ 17, సయ్యద్ కిర్మాణీ 14, బల్వీందర్ సంధూ 11, పరుగులు చేశారు. కీర్తి ఆజాద్ డకౌట్ అయ్యారు. 1983 ప్రపంచకప్ అందుకున్న తరువాత భారత క్రికెట్ జట్టు పేరు మారుమోగిపోయింది. అండర్ డాగ్ గా బరిలో దిగి.. విశ్వ విజేతగా నిలిచిన జట్టుకు దేశ ప్రజలు నీరాజనం పలికారు.
నాటి కప్ లో టీమిండియా ప్రస్థానం ఇలా..
మాంఛెస్టర్ లో జరిగిన మొట్టమొదటి మ్యాచ్ లో కూడా భారత జట్టు వెస్టిండీస్ ను ఓడించింది. భారత జట్టు 262 పరుగులు చేయగా.. విండీస్ టీమ్ 228 రన్స్ కు ఆలౌటైంది. లీసెస్టర్ లో జరిగిన రెండో మ్యాచ్ లో జింబాబ్వేను ఓడించింది. నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కపిల్ డెవిల్స్ పరాజయం పాలయ్యారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 320 పరుగులు చేయగా.. భారత్ 158 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ తో ఓవల్ మ్యాచ్ లోనూ భారత్ పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ టీమ్ 282 పరుగులు చేయగా.. భారత్ 216 రన్స్ కు ఆలౌట్ అయింది. టర్న్ బ్రిడ్జి వేల్స్ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్ లో భారత ఘన విజయాన్ని సాధించింది. భారత్ 266 పరుగులు చేయగా.. జింబాబ్వే 235 పరుగలకు సరిపెట్టుకుంది. 17 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు దిగిన కపిల్ దేవ్ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. 175 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు.