సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. సౌతాఫ్రికాతో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 33 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52), ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 51) అర్ధశతకాలతో ఆదుకున్నారు.
ఈ ఇద్దరికి తోడుగా మహమ్మద్ హారిస్ (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు 28), మహమ్మద్ నవాజ్ (22 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 28) రాణించడంతో పాక్ భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్, రబడా, ఎంగిడి, షంసి తలో వికెట్ తీశారు.
వర్షం అంతరాయం కారణంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులుగా నిర్ణయించగా.. ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ జట్టులో కెప్టెన్ టెంబా బవుమా(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 36), ఎయిడెన్ మార్క్రమ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 20)మినహా అంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, హరీస్ రౌఫ్, మహమ్మద్ వసీం తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలవగా.. సౌతాఫ్రికా క్లిష్ట పరిస్థితులను కొని తెచ్చుకుంది.
సౌతాఫ్రికా తుదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడినా.. జింబాబ్వే చేతిలో భారత్ ఓడినా పాక్ సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆ జట్టు బంగ్లాదేశ్తో భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్, సౌతాఫ్రికా తదుపరి మ్యాచ్లు వర్షంతో రద్దయినా.. పాక్కు అవకాశం దక్కనుంది. అయితే భారత్కు మెరుగైన రన్రేట్ ఉండటం కలిసొచ్చే అంశం.
ఇక భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(0) డకౌటవ్వగా.. రిలీ రసౌ(7) సైతం నిరాశపరిచాడు. కెప్టెన్ టెంబా బవుమా(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 36), ఎయిడెన్ మార్క్రమ్(14 బంతుల్లో 4 ఫోర్లతో 20) పొరాడే ప్రయత్నం చేసినా.. అఫ్రిది, షాదాబ్ ఖాన్ దెబ్బతీసారు. వర్షం అంతరాయంతో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. అనంతరం ఆటను కుదించి కొనసాగించినా.. సౌతాఫ్రికా విజయం కోసం పోరాడలేదు.