అశ్విన్ను తీసుకోవడమే..
ఈ టోర్నీలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అందులో రవిచంద్రన్ అశ్విన్తో పాటు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ ఉన్నారు. వీరి ముగ్గురిలో అశ్విన్, అక్షర్ బ్యాటింగ్ చేయగల సమర్థులు. అంతేకాకుండా రవీంద్ర జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీరుస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ మాత్రం అశ్విన్ను తీసుకోవాలన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు ఇండియాకు వచ్చిన అతను మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అదే అశ్విన్ ప్రత్యేకత..
'టెస్టుల్లో అశ్విన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని మనకు తెలుసు. ఐపీఎల్ 2022 సీజన్లోనూ అతను గొప్పగానే బంతులను సంధించాడు. దీంతోనే టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోవడం అశ్విన్ ప్రత్యేకత. తుది జట్టులోకి అతడిని తీసుకొంటే మాత్రం మంచి ప్రదర్శన చేస్తాడని అనిపిస్తోంది. గతంలో ఆసీస్ పిచ్లపై అశ్విన్ రాణించాడు'' అని వెటోరీ తెలిపాడు. రాబోయే కాలంలో టెస్టుల్లో టీమిండియా తరఫున అశ్విన్, రవీంద్ర జడేజా కీలకమని, యువ బౌలర్ల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని వెల్లడించాడు.
అదొక్కటే సమస్య..
గాయంతో దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్కు అవకాశం ఇస్తే అతను ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్లోనూ రాణించగలడు. టాపార్డర్లో కూడా అశ్విన్తో ఆడించవచ్చు. ఐపీఎల్ 2022 సీజన్లో అతనికి టాపార్డర్లో ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై అతని బౌలింగ్ కూడా కీలకం కానుంది. భువీ, హర్షల్కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న నేపథ్యంలో అశ్విన్ను టాపార్డర్లో ఆడించినా పెద్ద నష్టం ఉండదు. కానీ డెత్ ఓవర్లలో పవర్ హిట్టింగ్ మిస్సయ్యే ప్రమాదం ఉంది.