అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అఫ్గానిస్థాన్తో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆసీస్ 4 పరుగులతో గట్టెక్కింది. అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 48 నాటౌట్) విరోచిత పోరాటంతో ఆసీస్ను వణికించాడు.సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవడం ఆసీస్కు ముఖ్యం. అయితే ఈ మ్యాచ్లో చివరి బంతికి గట్టెక్కినా.. శ్రీలంక చేతిలో ఆ జట్టు సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇంగ్లండ్తో శనివారం జరిగే మ్యాచ్లో శ్రీలంక విజయం సాధిస్తే ఆసీస్ సెమీస్కు చేరుకుంటుంది. వర్షంతో రద్దయినా ఆ జట్టుకు అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం మెరుగైన రన్రేట్తో టోర్నీలో ముందడుగు వేస్తోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్వెల్(32 బంతుల్లో 6 ఫోర్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మిచెల్ మార్ష్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 45), డేవిడ్ వార్నర్(18 బంతుల్లో 5 ఫోర్లతో 25) విలువైన పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా.. ఫజల్లాక్ ఫరూఖీ రెండు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. రషీద్ ఖాన్కు తోడుగా గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), రెహ్మానుల్లా గుర్బాజ్(17 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్స్లతో 30) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తీయగా.. కేన్ రిచర్డ్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
చివరి ఓవర్లో అఫ్గాన్ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. స్టోయినిస్ వేసిన వైడ్ బంతికి రసూలీ(15) రనౌట య్యాడు. మరుసటి బంతి డాట్ అవ్వగా.. రెండో బంతిని రషీద్ బౌండరీకి తరలించాడు. మూడో బంతి డాట్ అవ్వగా..నాలుగో బంతిని సిక్సర్గా కొట్టి ఐదో బంతికి క్విక్ డబుల్ తీసాడు. చివరి బంతికి రషీద్ ఫోర్ కొట్టినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా మరో బ్యాటర్ క్రీజులో ఉండి ఉంటే అఫ్గాన్ విజయం సాధించేది.