హైదరాబాద్: షార్జాలో ఈ ఏడాది 23న నిర్వహించనున్న టీ-10 లీగ్ మ్యాచ్కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. టీ-10 టోర్నమెంట్ నిర్వహించేందుకు వీలుగా నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకుల నుంచి భరోసా వచ్చిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికార ప్రతినిధి పీటీఐకి తెలిపాడు.
'ఐసీసీ నియమావళి ప్రకారం అవసరమైన అన్ని లాంఛనాలను నిర్వాహకులు పూర్తి చేయడంతో టీ10 లీగ్కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఆటకు ఆదరణ పెంచేందుకు మా ప్రయత్నం కొనసాగించేలా, ఈ ఫార్మాట్ను అందరూ అంగీకరించేలా ఇది మాకు బాధ్యతను కూడా ఇస్తుంది' అని ఐసీసీ వెల్లడించింది.
కొత్తగా టీ-10 ఫార్మాట్ను ప్రారంభించడంతో రానున్న రోజుల్లో మరింతమంది అభిమానులు పెరగనున్నారని ఐసీసీ భావిస్తోంది. టీ10 లీగ్ రెండో టోర్నీ నవంబరు 23న ఆరంభం కానుంది. ఈ టీ10 లీగ్ చైర్మన్ షాజీ ఉల్ ముల్క్ మాట్లాడుతూ.. టోర్నీ నిర్వహించడం ద్వారా భాగస్వాములు, స్టేక్ హోల్డర్లు రావడంతో పాటు కీలకమైన ప్లేయర్లకు బూస్టింగ్గా కూడా ఉపయోగపడుతుంది. లీగ్ ఏటా మెరుగయ్యేలా చర్యలు చేపడుతాం.
కాగా, ఈ లీగ్లో ఆడనున్న ప్రముఖ ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి. అఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ (మరాఠా అరేబియన్స్). పాకిస్థాన్ షాహిద్ అఫ్రీది(పక్తూన్స్), షోయబ్ మాలిక్(పంజాబి లెజెండ్స్), ఇంగ్లాండ్ ఇయాన్ మోర్గాన్(కేరళ కింగ్స్), న్యూజిలాండ్ బ్రాండ్ మెక్కల్లమ్ (రాజ్పుత్స్), వెస్టిండీస్ సునీల్ నరైన్(బెంగాల్ టైగర్స్), డారెన్ సెమీ(నార్తన్ వారియర్స్), ఆస్ట్రేలియా షేన్ వాట్సన్(కరాచియన్స్)లు పాల్గొననున్న జట్లలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.