సంతోషించా..
కోహ్లీ స్లెడ్జింగ్ను తాను ఆస్వాదించానని చెప్పుకొచ్చాడు. 'సహజంగానే విరాట్ కోహ్లీ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. నాతోనే కాకుండా ఏ ప్రత్యర్ధి బ్యాట్స్మెన్తోనైనా ఇలానే దూకుడుగా ప్రవర్తిస్తాడు. నిజానికి విరాట్ స్లెడ్జ్ చేసినందుకు సంతోషంగా ఫీలయ్యా. ఎందుకంటే... నేను బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తామని భావించే అతను నా పట్ల అలా స్లెడ్జింగ్కు దిగాడు. నా వికెట్ తీయాలని, తద్వారా గెలుపొందాలనేది అతని వ్యూహం. అంటే, నా బ్యాటింగ్ వల్ల వారికి ప్రమాదం పొంచి ఉందనే అర్థం కదా.
నేను రియాక్ట్ అవ్వను..
అయితే ఇదంతా ఆట వరకే. నిజానికి కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆ ఘటన తర్వాత, మైదానం వెలుపల తను నాతో ఎంతో నార్మల్గా ఉన్నాడు. బాగా ఆడావని మెచ్చుకున్నాడు. ఆ రోజు నా వికెట్ తీయాలనే అలా ప్రవర్తించాడు. అయితే ఇలా ఘటనల పట్ల నేను పెద్దగా రియాక్ట్ అవ్వను. మాములుగానే నేను మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాను. ప్రత్యర్థుల కవ్వింపులను అస్సలు పట్టించుకోను. ఆ క్రమంలోనే ఆ రోజు కూడా నా పనిని నేను చేశాను'అని సూర్య చెప్పుకొచ్చాడు.
సూర్య X కోహ్లీ..
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై, ఆర్సీబీ మధ్య నాటి మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సూర్య... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా, ముంబై ఎనిమిదో విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్కు చేరువైంది. అయితే ఈ మ్యాచ్ 13వ ఓవర్లో కోహ్లీ బంతిని షైన్ చేస్తూ సూర్యకు దగ్గరగా వచ్చి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న అతడితో వాగ్వాదానికి సిద్ధమయ్యాడు. అయితే సూర్యకుమార్ ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ, కోహ్లీకి దూరంగా వెళ్లిపోయాడు. చివరకు మ్యాచ్ గెలిచి.. 'నేనున్నా'అని సైగలు చేశాడు.
శ్రీలంక పర్యటనకు..
ఐపీఎల్ 2020 సూపర్ పెర్ఫామెన్స్తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన సూర్య.. స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో దుమ్మురేపాడు. ఆ సిరీస్లో రెండో టీ20 ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ మొదలుపెట్టిన అతనికి కోహ్లీ, ఇషాన్ కిషన్ల సూపర్ ఇన్నింగ్స్ల కారణంగా బ్యాటింగ్ రాలేదు. అనంతరం మూడో టీ20లో చోటు కోల్పోయిన నాలుగో టీ20లో వచ్చిన అవకాశాన్ని ఈ ముంబైకర్ అందిపుచ్చుకున్నాడు. సిక్సర్తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల ఖాతా తెరిచిన సూర్య... కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన ఐదో భారత క్రికెటర్గా రికార్డుకెక్కాడు. ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదాపడటంతో ఇంటికే పరిమితమైన సూర్యకు శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత బి జట్టులో అవకాశం దక్కనుంది.