మరింత నైపుణ్యం నేర్చుకుంటా:
తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఇండియా టుడేతో మాట్లాడుతూ... 'టీమిండియాకు ఎంపికైనందుకు ఎంతో గర్వంగా ఉంది. ఆ శుభవార్త విన్న తర్వాత నా క్రికెట్ ప్రయాణం ఒక్కసారిగా గుర్తొచ్చింది. నా కుటుంబమంతా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో కంటున్న కల ఇది. ప్రస్తుతం ఆట పరంగా ఉత్తమంగా ఉన్నా. ఏ మేరకు ప్రాక్టీస్ చేయాలో, ఎంత విశ్రాంతి తీసుకోవాలనే అంశాలపై పూర్తి అవగాహన ఉంది. భారత జట్టుకు విజయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నుంచి ఆటలో మరింత నైపుణ్యం నేర్చుకుంటా. భారత ఆటగాళ్లందరి సాయంతో సాధ్యమైనంత వరకు నా ఆటను మెరుగుపర్చుకుంటా' అని చెప్పాడు.
ఒంటరిగా బీచ్కు వెళ్లా:
'ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై ఎంతో నిరాశ చెందా. అయితే కుటుంబంతో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరూ నాకు ధైర్యం చెప్పారు. శ్రమిస్తూనే ఉండమని, సమయం వచ్చినప్పుడు తప్పక అవకాశం వస్తుందన్నారు. ఆ సమయంలో నా భార్యకు "ఒంటరిగా బీచ్కు వెళ్తా, తిరిగివచ్చేప్పుడు నవ్వుతూ తిరిగొస్తా' అని చెప్పా. బయోబబుల్, ఎంపిక కాకపోవడం వంటి ఆ పరిస్థితుల్లో నా సతీమణి నాతో ఉండటం అదృష్టమే. అదే సమయంలో ముంబై జట్టుకు కీలక మ్యాచ్లు ఉన్నాయి. మానసికంగా సన్నద్ధమై మంచి ప్రదర్శన చేశా' అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
ఆ ఘనత రోహిత్ శర్మదే:
ముంబై ఇండియన్స్ మద్దతు వెలకట్టలేనిది. కోల్కతా నుంచి ముంబై జట్టులోకి వచ్చిన రోజులు ఇంకా గుర్తున్నాయి. కోల్కతాలో నేను ఫినిషర్ రోల్ని పోషించేవాడిని. ముంబై జట్టు నన్ను టాప్ ఆర్డర్లో ఆడించడమే కాకుండా స్వేచ్ఛగా చెలరేగిపోయే అవకాశం కల్పించింది. నెం.4లోనే కాదు కొన్ని సార్లు ఓపెనర్గా కూడా ఆడాను. కెప్టెన్ రోహిత్ శర్మ నాపై చాలా నమ్మకం ఉంచాడు. ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నింపేవాడు. నేను భారత జట్టులోకి ఎంపికయ్యానంటే ఆ ఘనత రోహిత్ శర్మదే' అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
16 మ్యాచ్ల్లో 480 పరుగులు:
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్ల్లో 40 సగటు, 145 స్ట్రైక్రేట్తో 480 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు అవకాశం ఇవ్వని సెలెక్టర్లు.. తాజాగా ఛాన్స్ ఇచ్చారు. మార్చి 12న భారత్-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
బెంగళూరు ఆటగాళ్ల పూర్ షో.. న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు!!