మహీ మళ్లీ క్రికెట్ ఆడాలి:
ఐపీఎల్ సీజన్-13లో రాణించాలని చెన్నైలో సురేష్ రైనా, అంబటి రాయుడు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మార్చి తొలి వారంలో ధోనీ కూడా వారితో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం ఉంది. తాజాగా రైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై మాట్లాడాడు. 'ఐపీఎల్ సీజన్-13 కోసం ప్రాక్టీస్ చేయడానికి ధోనీ మార్చి తొలి వారంలో చెన్నైకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మహీ భాయ్ కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలకాలని భావిస్తే.. ఎలాంటి ఆర్భాటం లేకుండా వైదొలుగుతాడు. నేను అయితే మహీ మళ్లీ క్రికెట్ ఆడటాన్ని చూడాలనుకుంటున్నా' అని రైనా తెలిపాడు.
టీమిండియాకు ధోనీ అవసరం ఉంది:
'ఇప్పటికీ ధోనీ ఎంతో ఫిట్గా ఉన్నాడు. కఠోర సాధన కూడా చేస్తున్నాడు. టీమిండియాకు ధోనీ అవసరం ఇప్పటికీ ఉందని నేను భావిస్తున్నా. అయితే అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది కోహ్లీ చేతుల్లో ఉంది. కోహ్లీ తీసుకోబోయే నిర్ణయంపైనే అతడి కెరీర్ ఆధారపడి ఉంది. కోహ్లీనే తుది నిర్ణయం తీసుకోవాలి' అని రైనా పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2019 అనంతరం ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరో మూడేళ్లు క్రికెట్ ఆడగలను:
'ఎక్కడ క్రికెట్ ఆడినా నా ఆటను ఎప్పుడూ ఆస్వాదించా. ప్రస్తుతానికి అయితే ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అయితే ఐపీఎల్లో సత్తాచాటాలని భావిస్తున్నా. ఐపీఎల్లో రాణిస్తే.. టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించడానికి నాకు అవకాశాలు ఉంటాయి. రెండుమూడేళ్ల వరకు నేను క్రికెట్ ఆడగలను. ఈ రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్లు జరగనున్నాయి. టీ20ల్లో నేను అద్భుత ప్రదర్శన చేయగలను' అని రైనా చెప్పుకొచ్చాడు.
మోకాలి గాయానికి సర్జరీ:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో సురేశ్ రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ప్రస్తుతం ఫిట్నెస్ సాధించేందుకు తంటాలు పడుతున్నాడు.
18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్లో తరచుగా మ్యాచ్లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు.