
హైదరాబాద్: టీమిండియా తరపున ఆడి మంచి రికార్డునే సాధించినా తనను జట్టు నుంచి తప్పించడం బాధించిందని సురేశ్ రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో అందరితో పాటు స్కోరు చేస్తున్నా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని విచారం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్లో తానేంటో నిరూపించుకునే అవకాశం మళ్లీ లభించిందని, ఈ అవకాశాన్ని వదులుకోనని అన్నాడు.
దక్షిణాఫ్రికా జట్టుతో టీ 20 ఆడటం నాకు చాలా ముఖ్యం అంటున్నాడు సురేశ్ రైనా. ఆ జట్టుతో టీ20 సిరీస్ రైనా మూడు మ్యాచ్లు కీలకమైనవి అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్నప్పటికీ ఈ సిరీస్ ఆడేటప్పుడు నేను కొత్తగా మ్యాచ్ ఆడుతున్నట్లు భావిస్తానని తెలిపాడు.
'రెండు సంవత్సరాల నుంచి క్రికెట్ లో తీవ్రంగా శ్రమిస్తున్నా. చాలా కాలం తర్వాత భారత జట్టును చూసి ఉద్వేగానికి లోనవుతానేమో అనిపిస్తుంది. ఐపీఎల్కు ఆడడానికైనా, 50 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకైనా ఖచ్చితంగా అనుభవం ఉండాలని' తెలియజేశాడు.
31 ఏళ్ల రైనా టీమిండియా తరపున 223 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. అయినా ఇప్పటికీ అరంగేట్రం చేస్తున్నట్లే అనిపిస్తోందని చెప్పాడు. ''నా వయసు 31. ఐతే వయసు అనేది కేవలం అంకె మాత్రమే. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమ్ఇండియా జెర్సీ అందుకోగానే.. అరంగేట్రంలో ఎలాంటి భావన కలిగిందో.. అలాంటి భావనే కలిగింది. అది చాలా ప్రత్యేకమైంది'' అని అన్నాడు.
''బాగా ఆడినా జట్టు నుంచి తప్పించడం బాధ కలిగించింది. ఇప్పుడు నేను యోయో పరీక్షలో పాసయ్యాను. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఇన్ని నెలల శిక్షణ తర్వాత.. భారత్ తరపున మళ్లీ ఆడాలన్న కాంక్ష మరింత బలపడింది. నా పోరాటాన్ని ఇక్కడితో వదిలేయను. వీలైనంత ఎక్కువ కాలం టీమ్ఇండియాకు ఆడేందుకు ప్రయత్నిస్తా. 2019 ప్రపంచకప్లో నేను ఆడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంగ్లాండ్లో బాగా ఆడతానని తెలుసు. నాలో ఇంకా ఎంతో సత్తా ఉంది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో రాణిస్తానన్న నమ్మకం ఉంది'' అని రైనా తెలిపాడు.
రైనా చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో రైనా 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత యోయో పరీక్షలో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ''జట్టుకు దూరంగా ఉన్న ఈ కాలంలో నా కుటుంబమే కొండంత బలాన్ని ఇచ్చింది. జాతీయ క్రికెట్ అకాడమీలో కఠోరంగా శ్రమించా. నా కెరీర్లో నేనెప్పుడూ ఫిట్గానే ఉన్నా. కానీ యోయో పరీక్ష సమయంలో గాయాలు బాధించాయి'' అని రైనా వివరించాడు. వన్డేల్లో 4, 5 స్థానాలు తన బ్యాటింగ్ శైలికి నప్పుతాయని రైనా చెప్పాడు.