చిన్నప్పుడే అనుకున్నా..
‘చిన్నప్పడు బ్యాట్ పట్టినప్పుడే అనుకున్నా ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో సభ్యుడిగా ఉండాలని. ఆ కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ మ్యాచ్ తాలూకు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఫైనల్ వరకు మా ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ఫైనల్ మ్యాచ్లో ఛేదనలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం.
టర్నింగ్ పాయింట్ ఇదే..
ఈ క్లిష్ట పరిస్థితిల్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ జోడి మూడో వికెట్కు 83 పరుగులు నమోదుచేసి విజయానికి గట్టి పునాది వేశారు. నా దృష్టిలో టీమిండియా ప్రపంచకప్ ఫైనల్లో గెలవడంలో ఇదే టర్నింగ్ పాయింటని భావిస్తాను. ఒత్తిడిలోనూ వారిద్దరూ బాధ్యతాయుతంగా ఆడిన తీరు అద్భుతం.
అందుకే ధోనీ వచ్చాడు..
అయితే విరాట్ కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్ రావాల్సింది కానీ ఇద్దరు లెప్టాండర్స్ అవుతుండటం, ముత్తయ్య మురళీధరన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్లో సమర్థవంతంగా ఆడిన అనుభవం ఉండటంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఫైనల్ వంటి పోరులో మిడిల్ ఓవర్లలో వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. అయితే వికెట్లు పడకుండా, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ధోని, గంభీర్లు చాలా బాగా ఆడారు. అయితే సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్ వెనుదిరగడం నిరుత్సాహపరిచింది. యువరాజ్తో కలిసి ధోని టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే గంభీర్-కోహ్లిలు మూడో వికెట్కు మంచి భాగస్వామ్యం నమోదు చేయకుంటే టీమిండియా విజయం అంత సులభం అయ్యేది కాదని నా భావన' అంటూ రైనా పేర్కొన్నాడు.