
హైదరాబాద్: మూడు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన అద్భుత విజయంపై భారత వెటరన్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ స్పందించారు. ఈ సూపర్ విక్టరీపై ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. తమ సహచర ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడారు. తమ ఫ్రాంచైజీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.
బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణించిందని కొనియాడాడు. చెన్నై లక్ష్య చేధనకు దిగిన తర్వాత.. వాట్సన్, డుప్లెసిస్ అద్భుతంగా ఆడుతున్నారంటూ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. 'సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్నందుకున్నారు. బాయ్స్ చాలా బాగా ఆడారు. మీ విజయానికి అభినందనలు. సూపర్ ఇన్నింగ్స్'అంటూ రైనా ట్వీట్ చేశాడు.
చాంపియన్స్ మళ్లీ పట్టాలెక్కారని, శార్ధుల్ ఠాకుర్ ఓవర్ గేమ్ చేంజరని భజ్జీ పేర్కొన్నాడు. 'చాంపియన్స్ మళ్లీ పట్టాలెక్కారు. చెన్నై గొప్ప విజయం సాధించింది. శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ వికెట్లను తీయడం మ్యాచ్ను మార్చేసింది'అని భజ్జీ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2020 సీజన్ కోసం సురేశ్ రైనా యూఏఈ వెళ్లినప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో తిరిగి భారత్కు వచ్చేశారు. ఇక హర్భజన్ సింగ్ కూడా తల్లి అనారోగ్యం, కరోనా భయాందోళన నేపథ్యంలో ఈ సీజన్కు దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఇద్దరి పేర్లను ఆటగాళ్ల జాబితా నుంచి తొలగించిన చెన్నై సూపర్ కింగ్స్.. వారిద్దరి కాంట్రాక్టులను సైతం రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించిందనే ప్రచారం జరిగింది.
అంతేకాకుండా టీమ్మేనేజ్మెంట్, ధోనీతో బేధాభిప్రాయాలు రావడంతోనే రైనా తిరిగి వచ్చేశాడనే వార్తలు కూడా వినిపించాయి. అయితే వీటిని ఖండించిన రైనా.. తన మేన మామ కుటుంబం హత్యకు గురవడంతోనే భారత్కు వచ్చానని, అవకాశమిస్తే మళ్లీ ఆడుతానన్నాడు. కానీ ఈ వ్యాఖ్యలపై సీఎస్కే మేనేజ్మెంట్ స్పందించలేదు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.