హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ టెస్టుల్లో ఆడుతున్న తీరు పట్ల లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతను తక్షణం తన శైలిని మార్చుకోవాల్సి ఉందని సూచించాడు. టెస్టులకు సరిపడేలా ఆటతీరును మార్చుకోవాలని సూచించాడు. అతని ఆటతీరును విశ్లేషిస్తూ.. బంతిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపై సలహాలిచ్చాడు.
'టెస్టులకు తగ్గట్టుగా ధావన్ తన ఆటను మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇతర ఫార్మాట్లలో తాను విజయవంతమైన ఆటనే కొనసాగిస్తున్నాడు. అతను కొట్టే షాట్లు వన్డేలకు నప్పుతాయి. ఎందుకంటే స్లిప్లు ఎక్కువగా ఉండవు. బంతి ఎడ్జ్ తీసుకున్నా కూడా పరుగులు లభిస్తాయి. అయితే టెస్టుల్లో ఇలా కుదరదు. బంతి ఎడ్జ్ తీసుకుంటే వికెట్ కోల్పోయినట్లే. అందుకే ఫార్మాట్కు తగ్గట్టు ఆటగాళ్లు మానసికంగా కూడా సిద్దం కావాలి. లేకపోతే విదేశాల్లో టెస్టులు ఆడేటప్పుడు ఇబ్బంది పడక తప్పదు.
ఇంగ్లాండ్తో తొలి టెస్టులో చతేశ్వర్ పుజారాను తుది జట్టులో తీసుకుంటే బాగుండేది. అతణ్ని తొలి టెస్టులో తీసుకోకుండా టీమ్ఇండియా తప్పు చేసింది. టెక్నిక్తో పాటు ఎంతో సహనం ఉన్న పుజారా తుది జట్టులో ఉండాలి. నేనైతే లార్డ్స్లో జరిగే రెండో టెస్టులో అతణ్ని తప్పక ఆడిస్తా. ఉమేశ్ స్థానంలో పుజారాను తీసుకుని.. హార్దిక్ పాండ్యను కొనసాగిస్తా. లార్డ్స్ టెస్టులో భారత్ గెలవాలంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలి.
గతేడాది జొహానెస్బర్గ్లో భారత్తో జరిగిన మూడో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులు కూడా ఛేదించలేక కుప్పకూలింది. భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులోనూ ఇదే దృశ్యాన్ని చూశాం. లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే ఇంగ్లాండ్ కూడా ఇబ్బంది పడేదేమో. అసలు కపిల్దేవ్కు హార్దిక్ పాండ్యకు ఎందుకు పోలిక? కపిల్ను ఎవరితోనూ పోల్చకూడదు. అతను కేవలం ఒక తరానికి మాత్రమే పరిమితమయ్యే ఆటగాడు కాదు. బ్రాడ్మన్, సచిన్ టెండూల్కర్లా సెంచరీకొక్కడు.