ఆర్చర్ బౌలింగ్లో..
తొలుత వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్, శుభ్మన్ గంటకుపైగా పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. ఆపై కాస్త కుదురుకున్నట్లు కనిపించిన గిల్ రెండు ఫోర్లు కొట్టి లయ అందుకున్నాడు. అయితే, ఆర్చర్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి షాట్ ఆడిన అతను షార్ట్ మిడ్ వికెట్లో క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమిండియా 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్ ఎంపిక చేసుకున్న షాట్ తప్పని గవాస్కర్ పేర్కొన్నాడు.
బంతిని స్కిడ్ చేసే..
'శుభ్మన్ గిల్ రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టి ఔటయ్యాడు. అయితే, అతను తప్పుడు షాట్ ఎంపిక చేసుకొని మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో అతని ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఎంత బాగా కష్టపడ్డా ఇలా జరుగుతూ ఉంటుంది. జోఫ్రా ఆర్చర్లాంటి పేసర్ బౌలింగ్లో ఇలాంటి షాట్ ఆడగలుగుతామని అనుకోవడం సరికాదు. ఇంగ్లండ్ పేసర్కు బంతిని స్కిడ్ చేసే సామర్థ్యం ఉంది. అదే ఇప్పుడు ప్రయోగించాడు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అద్భుత ప్రదర్శన కనబర్చినా శుభ్మన్ తప్పిదాలను రిపీట్ చేస్తున్నాడని, ముఖ్యంగా షాట్ ఎంచుకునే విషయంలో పరిపక్వత సాధించాలన్నాడు.
భారత్దే ఆధిపత్యం..
ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్కు 3 వికెట్లు దక్కాయి.
100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు.ఇక రెండో రోజు భారత బ్యాట్స్మెన్ ఏ మేరకు రాణిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ కోహ్లీసేన భారీ స్కోర్ సాధిస్తే ఇంగ్లండ్ను ఓడించే చక్కటి అవకాశం ముందుంది.