ఇకనైనా ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వొద్దు..
'ఈ ఓటమితోనైనా బుద్ధి తెచ్చుకోండి. ప్లేయర్లకు అతిగా రెస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మాటిమాటికీ జట్టును మారుస్తుండటం మంచిది కాదు. ప్లేయర్లు ఇకపై బ్రేకులు తీసుకోరని అనుకుంటున్నా. వరల్డ్ కప్కు పెద్దగా సమయం లేదు. వరల్డ్ కప్లో ఏ టీమ్ను అయితే ఆడించాలని అనుకుంటున్నారో.. ఆ జట్టులో ఆటగాళ్లంతా ఇకపై జరిగే ప్రతీ సిరీస్ ఆడాలి. మీరు టీమిండియాకు ఆడుతున్నారు. ఏదో క్లబ్ క్రికెట్లో ఆడుతున్నట్టుగా కుటుంబంతో గడపాలని, మరేదో కారణం చెప్పి రెస్ట్ కోరుకోవడం కరెక్ట్ కాదు. అవసరమైతే ఒకటి రెండు మార్పులు చేయడంలో తప్పు లేదు.
వీలైనన్నీ మ్యాచ్లు..
అయితే ప్రధాన ప్లేయర్లు మాత్రం ప్రతీ వన్డే ఆడాలి. వాళ్లకు రెస్ట్ ఇవ్వకూడదు. వరల్డ్ కప్ గెలవాలంటే ఇకపై ఒకే టీమ్, ఒకే కెప్టెన్ ఫార్ములాను కొనసాగించాలి. సిరీస్కో కెప్టెన్గా మారుస్తూ ఉంటే టీమ్ కాంబినేషన్ దెబ్బ తింటుంది. ఒకే జట్టుతో ఆడుతూ ఉంటే లోపాలను తెలుసుకోవడానికి సమయం దొరుకుతుంది.' అని గవాస్కర్ సూచించాడు. బంగ్లాదేశ్తో భారత ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 70-80 పరుగులు తక్కువగా చేసిందన్నాడు. క్యాచ్ నేలపాలు చేశాడని రాహుల్ను నిందించడం సరికాదన్నాడు.
సెంచరీలు చేస్తేనే..
శుభ్మన్ గిల్ అత్యంత అరుదైన ఆటగాడని, అతను జట్టులోకి రావాలంటే నాలుగు, ఐదు సెంచరీలు చేయాలన్నాడు. 50, 60లు చేస్తే జట్టులోకి రాలేడని చెప్పాడు. 'లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉండటం జట్టుకు అడ్వాంటేజే. శిఖర్ ధావన్ లెఫ్టాండర్ కాబట్టే అతను వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. అతను వైట్ బాల్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. శుభ్మన్ గిల్ జట్టులోకి రావాలంటే అసాధారణ ప్రదర్శన కనబర్చాలి. మూడు, నాలుగు సెంచరీలు చేయాలి.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఏడాదిలో 8 మంది కెప్టెన్లు..
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా ఏడాదిలో 8 మంది తాత్కాలిక కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది... స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మే టీమ్కు పూర్తిగా అందుబాటులో లేడని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదహారణ. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ... ఇలా సీనియర్లు ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న సందర్భాలే ఎక్కువ. వర్క్ లోడ్ పేరిట ఆటగాళ్లకు వరుసగా రెస్ట్ ఇవ్వడంపై భారత మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.