న్యూఢిల్లీ: మైదానంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడపానని దిగ్గజ అంపైర్ స్టీవ్ బక్నర్ తెలిపారు. ముఖ్యంగా భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ విషయంలో తాను చేసిన రెండు పొరపాట్లను ఆయన గుర్తు చేసుకున్నారు. రెండు సందర్భాల్లో పొరపాటు వల్లనే తప్పిదం జరిగిందని ఓ రేడియా కార్యక్రమంలో బక్నర్ చెప్పుకొచ్చారు.
'రెండు సందర్భాల్లో టెండూల్కర్ను పొరపాటున ఔటిచ్చా. 2003 గాబా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ గిలెస్పీ వేసిన బంతికి సచిన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఆ బంతి వికెట్ల పైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్టు రిప్లేలో తేలింది. మరోసారి 2005 కోల్కతా వన్డేలో పాకిస్తాన్ బౌలర్ అబ్దుల్ రజాక్ వేసిన బంతికి సచిన్ను క్యాచ్ ఔట్గా ప్రకటించా. కానీ, తర్వాత తెలిసింది, అది బ్యాట్కు తాకనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే, వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్ కూడా తప్పుడు నిర్ణయాలు కావాలని తీసుకోడు. ఈడెన్ గార్డెన్స్లో కిక్కిరిసిన అభిమానుల హర్షధ్వానాలే రెండో పొరపాటుకు కారణమని భావిస్తున్నా.
లక్ష మంది ఆ మ్యాచ్ వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్కు తగిలింది లేనిది గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. వాటి వల్లే నా కెరీర్ ప్రమాదంలో పడొచ్చని అనుకుంటున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. కానీ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అంపైర్లకు ఆ బాధతప్పింది' అని బక్నర్ తెలిపారు.
ఇక క్రికెట్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డీఆర్ఎస్ పద్ధతి పొరపాటు నిర్ణయాలు సమీక్షించుకునేందుకు చక్కని అవకాశాలు ఇచ్చాయన్నారు. అవి అంపైరింగ్పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేను కానీ, నిర్ణయాల్లో కచ్చితత్వం తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్ అభిప్రాయపడ్డారు. సచిన్ పట్ల బక్నర్ చేసిన ఈ రెండు తప్పిదాలు అంపైర్గా అతని విజయవంతమైన కెరీర్లో మాయని మచ్చగా నిలిచిపోయాయి.
ఐపీఎలే పెద్ద బ్రాండ్ .. చైనా స్పాన్సర్లు ఎందుకు: హర్భజన్