కోహ్లి స్థాయి కొత్తగా చెప్పనవసరంలేదు:
అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్థాయి ఏంటో కొత్తగా చెప్పనవసరంలేదు. మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా అతను ఆడుతుంటే దేశం మొత్తం మ్యాచ్ చూడటం మాత్రం ఖాయం. ఇప్పుడతను సుదీర్ఘ షెడ్యూల్ నుంచి విశ్రాంతి కోరుకుంటూ ఆసియా కప్కు దూరమయ్యాడు. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగితే భారత్ మాత్రం కోహ్లిని పక్కన పెట్టిందని... ఏసీసీతో తాము చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని ఆరోపించింది.
బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్లు
కోహ్లీ అవుటైన వెంటనే వ్యూయర్షిప్ ఎలా తగ్గుతుందో కొన్ని విశ్లేషణలను కూడా జత చేసింది. గతంలో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్లు రావడం, అతను ఔట్ కాగానే పడిపోయిన విషయాన్ని కూడా స్టార్ గుర్తు చేసింది. భారీ మొత్తం చెల్లించి ఏసీసీతో ఎనిమిదేళ్ల కాలానికి స్టార్ ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్కు విశ్రాంతినివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమతో పాటు టోర్నీతో సంబంధం ఉన్న అనేక సంస్థలకు వాణిజ్యపరంగా నష్టదాయకమని పేర్కొంది.
ఘాటుగా స్పందించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశం టోర్నీకి ఆదాయం తెచ్చిపెట్టే వనరులను బాగా దెబ్బతీస్తున్నది అని ఏసీసీ గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ తుసిత్ పెరెరా మెయిల్లో రాశాడు. దీనిపై స్పందించిన బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ.. మా జట్టు ఎంపికలో మీ ప్రమేయం అవసరం లేదు. ప్రసారదారులు జట్టును ఎంపిక చేయలేరు. మాకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును ప్రకటించాం. బీసీసీఐకి ఉండే హక్కు ఇది.
ఎంపిక చేయడం, చేయకపోవడం మా ఇష్టం
కోహ్లీని ఎంపిక చేయడం, చేయకపోవడం మా ఇష్టం. ఫలానా వ్యక్తినిగానీ లేదా అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించే హక్కుగానీ ఏసీసీ, ప్రసారకర్తలకు లేదు అని ఘాటుగా సమాధానమిచ్చాడు.యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో మంగళవారం హాంకాంగ్తో, ఆ తర్వాత బుధవారం పాకిస్తాన్తో తలపడుతుంది.