హైదరాబాద్: తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ను కాదని 2008లో కోహ్లీని టీమిండియాకు ఎంపిక చేసినందుకు తనను సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించారని దిలీప్ వెంగ్సర్కార్ చేసిన ఆరోపణలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ స్పందించాడు.
వెంగ్సర్కార్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, ఇవి పూర్తిగా నిరాధారమైనవి అంటూ వాటిని తోసిపుచ్చారు. దురుద్దేశంతోనే అతడు ఈ ఆరోపణలు చేస్తున్నాడని శ్రీనివాసన్ పేర్కొనడం విశేషం. అంతేకాదు ఆ సందర్భంలో చోటుచేసుకున్న పరిణామాలను సైతం వివరించారు.
'వెంగీ మాటల్లో నిజం లేదు. 2008 లంక టూర్కు కోహ్లీతోపాటు బద్రీనాథ్ కూడా ఎంపికయ్యాడు. ఆ విషయం అతను మర్చి పోతున్నాడు. అతని పదవీకాలం విషయంలో నేను కల్పించుకున్నాననడంలో వాస్తవం లేదు. ఆ సమయంలో వెంగ్ సర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడు. ఎన్నిక ద్వారా ఈ పదవికి ఎంపికవుతారు. దాంతో పాటు చీఫ్ సెలెక్టర్గా కూడా ఉన్నారు' అని శ్రీని తెలిపాడు.
'సెలక్షన్ ప్యానెలో ఉన్న సభ్యులు బీసీసీఐకి చెందిన ఇతర విభాగాల్లో ఉండకూడదు. ఆ సమయంలో వెంగ్ సర్కార్ ఉపాధ్యక్షుడిగా కొనసాగడానికే సుముఖత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి బీసీసీఐ ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన తొలగింపు వెనక నేనున్నట్లు ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.
'సమయంలో నేను కోశాధికారిని మాత్రమే. ఆ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. అయినా ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్పడం దేనికి? నేను పదవిలో ఉండగా ప్రవేశపెట్టిన పలు పథకాలతో అతను లబ్ది పొందాడు. 1994లో మాజీ క్రికెటర్లకు పెన్షన్ లేనప్పుడు అతని బెనిఫిట్ మ్యాచ్కు ఇండియా సిమెంట్స్ రూ. లక్ష ఇచ్చింది. మేం అతణ్ణి జాతీయ హీరోగా చూశాం. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం బాగాలేదు' అని అన్నాడు.
'ధోనీ.. కోహ్లీని జట్టులోకి తీసుకోవద్దని చెప్పాడు'
వెంగ్ సర్కార్ ఏమన్నాడు?
విరాట్ కోహ్లీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం వల్లే ఛీఫ్ సెలెక్టర్ పదవిని కోల్పోవలసి వచ్చిందని అన్నాడు. 'కోహ్లీ ఎంపిక తర్వాత రోజు శ్రీనివాసన్.. శ్రీకాంత్ను వెంటబెట్టుకొని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే చీఫ్ సెలెక్టర్గా నా పదవి పోయింది' అని అన్నాడు.