కొలంబో: శ్రీలంక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ కుశాల్ మెండిస్ను ఈ రోజు( ఆదివారం) ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో శివారులోని పనాదుర వద్ద కుశాల్ మెండిస్ కారు అదుపుతప్పి ఓ 74 ఏళ్ల వృద్ధుడ్ని ఢీకొనగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుశాల్ కారును అతి వేగంతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
అలసత్వం, అతివేగంతో కారునడిపిన మెండిస్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా శ్రీలంక క్రికెట్ జుట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కుశాల్ ఇప్పటివరకు 76 వన్డేల్లో 2,167 పరుగులు, 44 టెస్టుల్లో 2,995 పరుగులు, 26 టీ20ల్లో 484 పరుగులు సాధించాడు.
శ్రీలంక క్రికెటర్ అరెస్టు అనే వార్త వెలువడగానే అందరూ 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ గురించి అనుకున్నారు. ఆ ఫైనల్ ఫిక్సింగ్ వివాదంపై విచారణ కోసం శ్రీలంక ప్రభుత్వం ఇటీవల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి చీఫ్ సెలక్టర్ డిసిల్వా, కెప్టెన్ కుమార సంగక్కర, ఓపెనర్ ఉపుల్ తరంగ, సెంచరీ చేసిన మహేళ జయవర్దనేలను విచారించారు.
అయినప్పటికీ.. ఫిక్సింగ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా విచారణ పేరిట స్టార్ ఆటగాళ్లను వేధించడం సరైంది కాదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విచారణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇక తాజాగా శ్రీలంక క్రికెటర్ అరెస్ట్ అనగానే అందరూ ఈ కేసు గురించేనని అనుకున్నారు.
2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ కేసులో మరో ట్విస్ట్ ఇచ్చిన మహిందానంద!