|
బౌద్ధ గురువుతో తాయెత్తులు:
భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. వెళ్లే ముందు లంకేయులు పూర్తి జాగ్రత్తలు తీసుకుని బయలుదేరారు. జట్టు అంతా బౌద్ధ గురువుతో తాయెత్తులు కట్టించుకున్నారు. తాయెత్తులకు సంబందించిన పోటోలను లంక బోర్డు ట్విటర్లో పోస్టు చేసింది.
బాంబులు లంకేయులను ఏమీ చేయలేవు:
లంక క్రికెటర్లను బంగారంలా చూసుకుంటామని పాక్ భరోసా ఇచ్చినప్పటికీ.. శ్రీలంక బోర్డు మాత్రం తన ప్రయత్నాలు తాను చేసింది. ప్రస్తుతం తాయెత్తులకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. క్రికెట్ అభిమానులు అందరూ ప్రస్తుతం తాయెత్తుల గురించే మాట్లాడుకుంటున్నారు. 'ఇక బాంబులు కూడా లంకేయులను ఏమీ చేయలేవు'.. 'ఇప్పటికీ ఇవన్నీ నమ్ముతున్నారా'.. పాక్ పర్యటనకు పటిష్ట భద్రత ఇదే' అని నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.
ఎలాంటి ఆందోళన లేదు:
విమానాశ్రయంకు వెళ్లేముందు టీ20 కెప్టెన్ దసన్ షనక మాట్లాడుతూ... '2017లో లాహోర్లో క్రికెట్ ఆడిన అనుభవం నాకు ఉంది. అక్కడి భద్రతాపరమైన అంశాలపై ఎలాంటి ఆందోళన లేదు. ప్రస్తుతం అక్కడ మంచి వాతావరణం ఉంది. మేమంతా ఈ పర్యటనపై సంతృప్తిగా ఉన్నాం' అని అన్నాడు. 'జట్టు పర్యటించే ప్రాంతాల్లో పాక్ గట్టి భద్రత ఏర్పాటు చేశారనే నమ్మకం ఉంది' అని వన్డే కెప్టెన్ లాహిరు తిరిమనే పేర్కొన్నాడు.
లంక సాహసం:
2009లో పాక్ పర్యటన సందర్భంగా.. శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆరుగురు లంక ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. ఎట్టకేకలకు లంక సాహసం చేస్తోంది.