దంబుల్లాలో మ్యాచ్ అంటూ చండీగఢ్లో నిర్వహించారు:
చండీగఢ్కు 16 కిలోమీటర్ల దూరంలోని సవారా అనే గ్రామంలో జూన్ 29న ఉవా క్రికెట్ లీగ్ పేరుతో ఓ టీ20 మ్యాచ్ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉవా ప్రీమియర్ టీ20 లీగ్.. ఇది శ్రీలంకలోని దంబుల్లా నగరంలో జరిగే ఓ క్రికెట్ టోర్నీ. ఉవా ప్రావిన్స్ క్రికెట్ సంఘం కేంద్రమైన దంబుల్లా నగరంలో ఈ మ్యాచ్ జరుగుతున్నట్లు ప్రచారం చేసుకున్న నిర్వాహకులు ఆ మ్యాచ్ను ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు.
శ్రీలంక లీగ్ పేరుతో మ్యాచ్:
ఈ మ్యాచ్పై ఓ పత్రికలో కథనం రావడంతో.. కరోనా వైరస్ నేపథ్యంలో ఒక మ్యాచ్ ఎలా సాధ్యమంటూ వివరాల్లోకి వెళితే అసలు విషయం బయటపడింది. ఆన్లైన్ బెట్టింగ్ కోసమే ఇలాంటి మ్యాచ్ ఆడించినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే ఆడింది అంతా పంజాబ్ కుర్రాళ్లే. శ్రీలంకలో గుర్తింపు పొందిన క్లబ్ యువా పేరు వాడుకొని కొందరు తెలివిగా ఇలా చేసినట్లు తెలిసింది. లంక బోర్డు తమకు టోర్నీ నిర్వహణ కోసం అధికారికంగా అనుమతి కూడా ఇచ్చినట్లు చూపించడంతో ప్రత్యక్ష ప్రసారానికి 'ఫ్యాన్కోడ్' అనే సైట్ ముందుకు వచ్చింది.
ఇద్దరు అరెస్ట్:
ఈ మ్యాచ్కు సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కాబట్టి తాము ఎలాంటి చర్య తీసుకోలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. శ్రీలంక కూడా తమకు, ఈ టోర్నీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ప్రత్యక్ష ప్రసారం చేసిన ఫ్యాన్ కోడ్ మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్. వారికి చెందిన బ్రాండ్, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ 'డ్రీమ్ 11' ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటి. దీనికి ఎంఎస్ ధోనీ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.
మా పేరును వాడుకున్నారు:
ఈ మ్యాచ్పై పంజాబ్ పోలీసులూ అప్రమత్తం అయ్యారు. ఈ మ్యాచ్ గురించి తమకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించామని.. పంకజ్ జైన్, రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు కూడా చేశామని డీఎస్పీ ఖరార్ పాల్ సింగ్ తెలిపారు. మరోవైపు ఈ మ్యాచ్ ఎవరు, ఎలా నిర్వహించారో ఆరా తీస్తున్నామని బీసీసీఐ అనినీతి నిరోధక యూనిట్ చీఫ్ అజిత్ సింగ్ తెలిపాడు. తమ క్రికెట్ సంఘం కొన్నేళ్లుగా ఏమంత చురుగ్గా లేదని.. దీని అవకాశంగా మలుచుకుని తమ పేరును వాడుకున్నారని ఉవా ప్రావిన్స్ క్రికెట్ సంఘం ప్రతినిధి భగీరథ్ వివరణ ఇచ్చాడు.
'మరికొంత సమయం ఇవ్వాల్సింది.. తప్పుల్ని సరిచేసుకుంటున్న సమయంలో కెప్టెన్గా తొలగించారు'