కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ లంక మాజీ మంత్రి మహీందానంద అలుత్గామాగే చేసిన సంచలన ఆరోపణపై క్రిమినల్ ఇన్విస్టిగేషన్ మొదలైందని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. లంక వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఆరోపణలను ఆ దేశ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే మహిదానందను విచారించిన దర్యాప్తు విభాగం.. క్రిమినల్ ఇన్విస్టిగేషన్ను కూడా ప్రారంచిందని లంక క్రీడా శాఖ సెక్రటరీ కె.డి.ఎస్. రువాన్చంద్ర వెల్లడించారు.
'2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్రిమినల్ ఇన్విస్టిగేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ కేసుపై స్పెషల్ పోలీస్ టీమ్ పనిచేస్తోంది. అతి త్వరలోనే ఈ ఆరోపణల్లో నిజనిజాలను దర్యప్తు విభాగం బయటపెడుతుంది.'అని రువాన్ చంద్ర తెలిపారు.
ఇక 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయిందన్న మహీందానంద.. ఈ ఫిక్సింగ్లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయన్నారు. ఇక తన దగ్గర ఆధారాలున్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఈ శ్రీలంక మాజీ మంత్రి.. పోలీసుల ముందు మాత్రం ప్లేట్ ఫిరాయించాడు. ఫిక్సింగ్ జరిగిందనేది తన అనుమానం మాత్రమేనని వెల్లడించాడు. 'భారత్, శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచకప్-2011 ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని నేను అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని అక్టోబర్ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చాను'అని గత గురువారం పోలీసుల విచారణ అనంతరం మహిదానంద మీడియాకు తెలిపారు.
ఇక మహీందానంద తప్పించుకునే ధోరణిలో వ్యవహరించినా.. శ్రీలంక ప్రభుత్వం మాత్రం ఆ ఫైనల్పై సీరియస్ ఇన్విస్టిగేషన్ ప్రారంభించింది. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరపనున్నారు. ఇక మహిదానంద ఆరోపణలను ఇప్పటికే లంక మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, అరవింద డిసిల్వా ఖండించారు. నిరాధర ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు ఉంటే ఐసీసీకి ఇవ్వాలని మండిపడ్డారు.
ఇదేం పద్దతి ఐసీసీ.. ధోనీ బలిదాన్ బ్యాడ్జ్ వద్దని 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు అనుమతా?