ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ముంగిట సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మ చెలరేగాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారా ట్రోఫీలో పంజాబ్ తరఫున మెరుపు సెంచరీ నమోదు చేశాడు. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ (49 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్లతో 104) శతకం బాదాడు. అయినా పంజాబ్ జట్టు105 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు.. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (146 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్స్లతో 198) డబుల్ సెంచరీ సమాన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 402 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్లో అభిషేక్ శర్మ మెరుపు శతకం బాదినప్పటికీ.. సహచరుల నుంచి అతనికి సహకారం లభించలేదు. దాంతో పంజాబ్ జట్టు చివరికి 42.3 ఓవర్లలో 297 పరుగులకే ఆలౌటైంది.
లిస్ట్-ఎ క్రికెట్లో వేగంగా సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే..? బరోడాకి ఆడిన మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ 40 బంతుల్లోనే 108 పరుగులు చేసి నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత స్థానంలో 42 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్న అభిషేక్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకూ ఆ రెండో స్థానంలో ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ 50 బంతుల్లో ఉండగా.. విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని 2013లో అందుకున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2020 సీజన్లో 8 మ్యాచ్లాడి 126.78 స్ట్రైక్రేట్తో 71 పరుగులు చేశాడు. ఈరోజు మ్యాచ్లో ఓపెనర్గా ఆడిన అభిషేక్ను సన్రైజర్స్ గత ఏడాది లోయర్ ఆర్డర్లో ఆడించగా.. హిట్టింగ్తో అతను అదరగొట్టేశాడు. తాజాగా మెరుపు శతకం నేపథ్యంలో.. ఐపీఎల్ 2021 సీజన్లో అభిషేక్ను టాప్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉంది.