క్రికెట్ రీస్టార్ట్ కావాల్సిందే..
‘ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించాలనే అనుకుంటున్నాం. క్రికెట్ రిస్టార్ట్ కావాల్సిందే. ప్రస్తుతానికి ఖాళీనే. మార్చిలోనే దేశవాళీ షెడ్యూలును పూర్తిచేశాం. ఆ తర్వాత నిర్వహించాల్సిన ఐపీఎల్ కరోనా వల్ల వాయిదా పడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్పై స్పష్టతవస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం' అని ఇండియాటుడే ఇంటర్వ్యూలో దాదా చెప్పుకొచ్చాడు.
మా ప్రాధానత్య భారతే..
‘ఐపీఎల్ ఆతిథ్యానికి వివిధ దేశాలు ముందుకొస్తున్నాయనే వార్తలు మీడియా ద్వారానే వింటున్నాం. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ బోర్డు సభ్యుడు, మరే దేశం మమ్మల్ని సంప్రదించలేదు. మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఐపీఎల్ నిర్వహణకు మా తొలి ప్రాధాన్యత భారతే. ఎంత సమయం అనుకూలిస్తే అంత, కనీసం 35-40 రోజులు దొరికినా చాలు' అని గంగూలీ పేర్కొన్నాడు.
ఇప్పుడే ఏం చెప్పలేం..
‘ఐపీఎల్ లీగ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ పెద్ద జట్లు. అయితే ఆ నగరాల్లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో గుండెమీద చేయి వేసి ఈ నగరాల్లో క్రికెట్ జరుగుతుందని చెప్పలేం. మేం అహ్మదాబాద్ వెళ్లి కొత్త స్టేడియం చూద్దామనే ఆసక్తితో ఉన్నాం. మేం అక్కడికి చేరుగలమో లేదో తెలియదు. భారత్లో ఐపీఎల్ నిర్వహిస్తామని ఇప్పుడే స్పష్టతనివ్వడం కుదరదు' అని దాదా తెలిపాడు.
లీగ్ లేకుండా 2020 ముగియదు..
‘ముందు ఐపీఎల్కు విండో దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత భారత్లో నిర్వహించడం గురించి ఆలోచించాలి. కుదరకపోతే విదేశాల్లో ఎక్కడికి తరలించాలో.. అనువైన ప్లేస్ కోసం వెతకాలి. ఎందుకంటే విదేశాల్లో నిర్వహించడం బోర్డు, ఫ్రాంచైజీలకు చాలా భారం. మేం ప్రతి అంశాన్నీ పర్యవేక్షిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఐపీఎల్ లేకుండా 2020 మాత్రం ముగిసిపోవద్దనే కంకణం కట్టుకున్నాం' అని గంగూలీ స్పష్టం చేశాడు.