న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తోన్న దేశవాళి క్రికెట్ సీజన్ వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం వెల్లడించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం సాయంత్రం సమావేశమైంది. భారతదేశంలో పెరుగుతున్న కొరోనా కేసుల వల్ల గందరగోళంలో పడిన దేశీయ క్రికెట్ క్యాలెండర్ గురించి ఎక్కువ సమయం చర్చించారు. సమావేశం అనంతరం దాదా మాట్లాడారు.
'దేశవాళీ క్రికెట్పై సమగ్రంగా చర్చించిన తర్వాత వచ్చే జనవరి 1 నుంచి ఆ సీజన్ను ప్రారంభించాలని చూచాయగా నిర్ణయం తీసుకున్నాం. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా అన్ని టోర్నీలు నిర్వహించే అవకాశం లేకపోవచ్చు. రంజీ ట్రోఫీని పూర్తిస్థాయిలో జరిపేందుకు ప్రయత్నిస్తాం. రంజీ ట్రోఫీ కోసం జనవరి-మార్చి నెలల్లో నిర్వహణకు బీసీసీఐ దృష్టి సారిస్తుంది' అని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
జూనియర్ క్రికెట్, మహిళల టోర్నమెంట్లు మార్చి-ఏప్రిల్ మధ్య జరుగుతాయని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో భారత పర్యటన గురించి దాదా మాట్లాడుతూ... 'క్రికెట్ ఆస్ట్రేలియా పర్యటన మొత్తం వివరాలను పంపించింది. వాటిపై బీసీసీఐ అధికారులు చర్చించనున్నారు. జనవరి మూడో వారంలోగా అక్కడ 4 టెస్టులు ఆడతాం. అక్కడికి వెళ్లాక క్వారంటైన్లో కూడా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్లో పాల్గొంటారు' అని చెప్పారు.
ఇంగ్లండ్తో జరుగనున్న స్వదేశీ సిరీస్ గురించి బీసీసీఐ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని, తుది ప్రయాణాన్ని నిర్ణీత సమయంలో సిద్ధం చేస్తామని చెప్పారు. 'స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్కు మరో నాలుగైదు నెలల సమయం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి షెడ్యూల్ను రూపొందిస్తాం. భారత్లోనే ఈ సిరీస్ నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ సాధ్యంకాకపోతే రెండో ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని పరిశీలిస్తున్నాం' అని గంగూలీ చెప్పుకొచ్చారు.
IPL 2020: టిమాన్, పంబా మళ్లీ కలిశాయి.. గేల్తో చహల్!!