రెండుసార్లు పిటిషన్ దాఖలు:
బీసీసీఐ పరిపాలనలో మార్పుల కోసం నియమించిన లోధా కమిటీ గతంలో పలు సిఫారసులు చేసింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు వీటిలో రెండు అంశాలకు చిన్న సవరణలు చేస్తూ.. ఇవి మినహా మిగిలిన అన్నింటినీ బోర్డుతో పాటు అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు 2018 ఆగస్టులో దీనికి ఆమోద ముద్ర వేసింది. ఆ సమయంలో వీటిని అమలు చేస్తామంటూ బీసీసీఐ తమ నియమావళిని కూడా సవరించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తమ నియమావళిలో మళ్లీ సవరణలు చేసేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. గత డిసెంబర్ నుంచి రెండుసార్లు పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నెల 27తో ముగియనున్న గంగూలీ గడువు:
సుప్రీంకోర్టును బీసీసీఐ కోరుతున్న ప్రధాన అంశం 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' గురించి. నిబంధనల ప్రకారం బీసీసీఐలోగానీ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లోగానీ వరుసగా ఆరేళ్లు ఆఫీస్ బేరర్గా పని చేసినవారు ఆ తర్వాత కనీసం మూడేళ్ల పాటు ఎలాంటి పదవులు చేపట్టరాదు. సౌరవ్ గంగూలీ (బెంగాల్), జై షా (గుజరాత్) బీసీసీఐ పదవుల్లోకి రాకముందే రాష్ట్ర సంఘాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే వారు ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. గత నెలలోనే జై షా పదవీ కాలం ముగియగా.. ఈ నెల 27తో గంగూలీ గడువు కూడా ముగుస్తుంది.
దాదాకు ఇష్టం లేదు:
బోర్డు నూతన కార్యవర్గం ఏర్పడి పది నెలలు మాత్రమే అవుతోంది. అయితే ఇలా తప్పుకోవడం దాదా, షాలకు ఇష్టం లేదు. దాంతో బోర్డు నియమావళినే మార్చేసి పదవుల్లో కొనసాగాలని వీరు భావిస్తున్నారు. అందుకోసమే మార్పులు చేసుకునే అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గడప తొక్కారు. అయితే అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు ఇంకా రాలేదంటూ వీరు బోర్డు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు.
గడువు ముగిసినా:
గత అక్టోబరులో గంగూలీ, జై షా ఎంపికయ్యారు. ప్రస్తుత నిబంధన ప్రకారం వీరిద్దరు బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు అనర్హులవుతారు. అయితే గడువు ముగిసినా వీరిద్దరు ఇప్పటికే పలు సమావేశాల్లో, ఐసీసీ ప్రతినిధులుగా కూడా హాజరవుతున్నారు. సుప్రీం విచారణ వాయిదా పడటంతో.. పది రోజుల్లో జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలోనూ వీరు పాల్గొంటారని తెలుస్తోంది.
కర్మ ఎప్పటికైనా తిరిగి మన వద్దకే చేరుతుంది.. కంగనా రనౌత్కు మద్దతుగా నిలిచిన మనోజ్ తివారి!!