దుబాయ్ : ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన త్రీ నేషన్ ట్రై సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మంధాన మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానాన్ని అందుకుంది.
ఈ సిరీస్లో దారుణంగా విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ ఏడో స్థానానికి పడిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 9వ ర్యాంకును నిలబెట్టుకోగా.. యువసంచలనం షెఫాలీ వర్మ 20 స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్లు సుజీ బెట్స్, సోఫి డివైన్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. ట్రై సిరీస్లో అదరగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ మూడో స్థానం కైవసం చేసుకుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ మాత్రం మూడు స్థానాలు చేజార్చుకొని ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
'ఈసాల లోగో చాలా బాగుంది..' ఆర్సీబీపై సన్రైజర్స్ సెటైర్స్
బౌలర్ల జాబితాలో భారత ప్లేయర్ పూనమ్ యాదవ్ ఆరు స్థానాలు కోల్పోయి12వ స్థానంలో నిలవగా.. రాధాయాదవ్, దీప్తీ శర్మ 4,5 స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియా పేసర్ మెగన్ స్టక్ అగ్రస్థానంలో నిలవగా.. సౌతాఫ్రికా బౌలర్ శబ్నిమ్ ఇస్మైల్, ఇంగ్లండ్ బౌలర్ సోఫి రెండు, మూడు స్థానలను సొంతం చేసుకున్నారు. ఆల్రౌండర్ జాబితాలో భారత్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం.
ఇక ఫిబ్రవరి 21 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ భారత్ మహిళలు, ఆసీస్ మహిళల మధ్య జరగనుంది.