లండన్: కరోనా కారణంగా నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్లు.. చారిత్రాత్మక ఇంగ్లండ్-వెస్టిండీస్ మూడు టెస్ట్ల సిరీస్తో పున:ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం( జూలై 8) నుంచి బయో సెక్యూర్ వాతావరణంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ విధించిన తాత్కాలిక నిబంధనల మధ్య ప్రేక్షకుల్లేకుండా ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే అభిమానుల సమక్షంలో మ్యాచ్ జరిగితేనే ఆటగాళ్లకైనా.. టీవీల్లో వీక్షించే ప్రేక్షకులకైనా మజా ఉంటుంది. సిక్స్ కొట్టినా, సెంచరీలు చేసినా, వికెట్ పడినా కేకలు, ఈలలతో స్టేడియం హోరెత్తిపోతుంది. కరోనా.. పుణ్యమా అని ఇప్పుడా పరిస్థితి లేదు. అందువల్ల.. అభిమానులు లేని మ్యాచ్ చప్పగా సాగుతుందని భావించిన నిర్వాహకులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ఆటగాళ్లలో జోష్ నింపడానికి క్రికెట్ ఫ్యాన్స్ కేకలు, ఈలలతో నింపిన ఫేక్ ఆడియోను మ్యాచ్లో హైలైట్ మూమెంట్స్ సందర్భంలో ప్లే చేయాలని నిర్ణయించారు. మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అభిమానులు కూడా స్టేడియంలో ఉన్న అనుభూతిని ఆస్వాదించగలరన్నది నిర్వాహకుల ఆలోచన. ఈ ఫేక్ శబ్దాలను ప్లే చేసేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు రెండూ అంగీకరించాయి.
అయితే ఈ సరికొత్త క్రికెట్ మ్యాచ్ అనుభూతి ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. మాత్రం బుధవారం వరకూ ఆగాల్సిందే. ఇక ఈ మ్యాచ్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఓ వైపు కరోనా తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్.. మరోవైపు నల్లజాతీయులకు మద్దతుగా ఇరు జట్ల ఆటగాళ్లు 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'లోగోతో బరిలోకి దిగుతుండగా.. ఇంకోవైపు ఫేక్ ఆడియోతో ఓ కొత్త ఒరవడికి నాంది కానుంది.
భవిష్యత్తు క్రికెట్కు ప్రమాదకరం అంటూ.. ఐపీఎల్పై అక్కసు వెళ్లగక్కిన ఇంజమామ్