రోహిత్ ఒక్కసారి కుదురుకుంటే:
రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీల బ్యాటింగ్పై శిఖర్ ధావన్ స్పందిస్తూ... 'హిట్మ్యాన్ రోహిత్ ఆడేటప్పుడు తొలుత సమయం తీసుకుంటాడు. తర్వాత కుదురుకుంటాడు. రోహిత్ ఒక్కసారి కుదురుకుంటే.. ఆపడం ఎవరితరం కాదు. పరుగుల వరద పారాల్సిందే. మరోవైపు కోహ్లీ బ్యాటింగ్లోని క్లాస్, నిలకడతత్వం అద్భుతంగా ఉంటాయి. అతడో గొప్ప ఆటగాడు. మంచి కెప్టెన్. ఈతరం టీమిండియాతో ఆడటం నా అదృష్టంగా భావిస్తున్నా' అన్నాడు.
ప్రతీ ఆటగాడు భిన్నంగానే ఉంటాడు:
టీమిండియాలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమేనని, అలాంటి వారితోనే జట్టును రూపొందిస్తారని గబ్బర్ చెప్పాడు. 'ప్రతీ ఆటగాడు భిన్నంగానే ఉంటాడు. ఎవరి ప్రత్యేకత వాళ్లది. జట్టులో అదే చాలా ముఖ్యమైన విషయం. ఆ కలయికలే జట్టుకు ఉపయోపడతాయి. కాబట్టి ప్రతీ ఆటగాడు తమ శైలితో జట్టులో స్ఫూర్తి నింపుతారు' అని ధావన్ తెలిపాడు. శిఖర్ ధావన్ భారత్ తరఫున 36 టెస్టులు, 136 వన్డేలు, 61 టీ20ల ఆడాడు.
తోటి ఆటగాళ్లతో పోల్చుకునేవాడిని:
ఇతర ఆటగాళ్లతో పోల్చి చూసుకోవడం మానేశానని శిఖర్ ధావన్ తెలిపాడు. 'ఇదివరకు నా ఆటను తోటి ఆటగాళ్లతో పోల్చుకునేవాడిని. అయితే చివరికి దాని ఫలితం మరోలా ఉండేది. అలా పోల్చుకోవడంతో ఇతరులపై ఈర్ష్య మొదలయ్యేది. వాళ్లు బాగా ఆడాలని అనుకునేవాడిని. కానీ వాళ్ల కన్నా నేను మరింత బాగా ఆడాలని అనుకునేవాడిని. తర్వాత పరిస్థితులు అర్థం చేసుకొని వెనక్కి తగ్గాను. తర్వాత నా కలలన్నీ నెరవేర్చుకున్నానని తెలుసుకున్నా. ఇతరులతో పోటీపడటం వల్ల నేను నిజమైన ఆనందాన్ని కోల్పోయేవాడిని. ఇప్పుడా విషయం నుంచి బయటపడ్డా. నా ఆటను ఎవరితోనూ పోల్చుకోవట్లేదు. ఇకమీదట నేను రెండు రోజులు క్రికెట్ ఆడినా, రెండు సంవత్సరాలు ఆడినా ఆ విషయం నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు' అని సీనియర్ ఓపెనర్ చెప్పాడు.
మూడు నెలలుగా ఇంట్లోనే:
చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లోనూ (రాజ్కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు.