కొలంబో: పేలవ బ్యాటింగ్తోనే శ్రీలంక చేతిలో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. అయితే ఈ సిరీస్ పరాజయం తమ యువ ఆటగాళ్లకు ఓ గుణపాఠమని తెలిపాడు. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఈ విజయానికి వారు అర్హులని అభినందించాడు. గురువారం జరిగిన మూడో టీ20లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబర్చిన శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకొని వన్డే సిరీస్ పరాజయానికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్.. కెప్టెన్గా ఈ సిరీస్ను ఆస్వాదించానని తెలిపాడు. కఠిన పరిస్థితుల్లోనూ తమ జట్టు గొప్పగా పోరాడిందన్నాడు.
'సిరీస్ మధ్య కరోనా కలకలం రేగడం, ప్రధాన ఆటగాళ్లంతా ఐసోలేషన్లోకి వెళ్లడంతో కెప్టెన్గా నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ జట్టుగా మేం ఇక్కడే ఉంటూ సిరీస్ ఆడాలని నిర్ణయించుకున్నాం. కెప్టెన్గా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్లో ఆఖరి వరకు పోరాడం. కానీ ఈ రోజు చెత్త బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకున్నాం. అయితే మా కుర్రాళ్లకు ఈ ఓటమి ఓ గుణపాఠం అవుతుంది. ఈ రోజు మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ఆరంభంలోని వికెట్లు పడి.. బ్యాటింగ్ డెప్త్ లేనప్పుడు ఆటగాళ్లు ఒత్తిడికిలోనవ్వడం సహజం. ఈ సిరీస్లో ఇరు జట్లు గొప్ప స్పూర్తిని కనబర్చాయి. ఇదో అద్భుతమైన ఫీలింగ్. ఇక శ్రీలంక కెప్టెన్, ప్లేయర్స్ నా అనుభవాన్ని, నా ప్రాసెస్ను తెలుసుకోవాలనుకున్నారు. అందుకే మ్యాచ్ అనంతరం వారితో మాట్లాడాను. నేను చెప్పింది వారు ఆస్వాదించారనుకుంటున్నా'అని ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక సిరీస్ గెలిచిన శ్రీలంక టీమ్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 రన్స్ మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్(28 బంతుల్లో 23 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. టాప్-5 బ్యాట్స్మన్ శిఖర్ ధావన్(0), దేవదత్ పడిక్కల్(9), సంజూ శాంసన్(0), రుతురాజ్ గైక్వాడ్(14), నితీశ్ రాణా(6) దారుణంగా విఫలమయ్యారు. బర్త్డే బాయ్ వానిందు హసరంగ(4/9) 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా డసన్ షనక రెండు వికెట్లు తీశాడు. రమేశ్ మెండీస్, దుష్మంత చమీరా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూ పాడుతూ 14.3 ఓవర్లలో మూడు వికెట్లకు 82 రన్స్ చేసి విజయాన్నందుకుంది. రాహుల్ చాహర్(3/15) మూడు వికెట్లతో రాణించినా మిగతా బౌలర్లు అండగా నిలవలేకపోయారు. ధనుంజయ డిసిల్వా(19 బంతుల్లో 2 ఫోర్లు 23 నాటౌట్) మరోసారి కడవరకు నిలిచి విజయాన్నందించాడు. అతనికి అండగా వానిందు హసరంగా(14 నాటౌట్) రాణించాడు.