
కాన్పూర్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ చివరి సెషన్లో టీమిండియా ఘోర తప్పిదం చేసిందని, దాంతో సునాయసంగా గెలిచే మ్యాచ్లో ఓటమి పాలైందని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నాడు. మ్యాచ్ జరుగుతుండగానే అతను ట్విటర్ వేదికగా భారత తప్పిదాలను పాయింట్ ఔట్ చేశాడు. చివరి సెషన్లో భారత జట్టు తీరు తనని ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. టీమిండియా కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా.. నాలుగు ఓవర్లు ఆలస్యంగా తీసుకుందన్నాడు. ముందుగానే తీసుకుంటే ఫలితం భారత్కు అనుకూలంగా ఉండేదని, కొత్త బంతితోనే జడేజా రెండు వికెట్లు తీసాడని షేన్ వార్న్ గుర్తు చేశాడు.
'భారత జట్టు కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. వెలుతురు సరిగ్గా లేని పరిస్థితుల్లో, ఓవర్లు పూర్తవుతున్న క్రమంలోనూ పాత బంతితోనే బౌలింగ్ చేస్తోంది. ఇది విచిత్రంగా ఉంది' అంటూ మ్యాచ్ జరుగుతుండగానే వార్న్ ట్వీట్ చేశాడు. కాసేపటికే మరో ట్వీట్లో..'ముందే కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా.. అదే పాత బంతితో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారుతుందా..? అప్పుడే బంతిని అందుకుంటే న్యూజిలాండ్ వెనుకంజలో నిలిచేదా? లేక టీమిండియా గెలిచేదా?' అని వార్న్ ప్రశ్నించాడు.
ఈ మ్యాచ్లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై తొలి టెస్టు చివరి రోజు మిగిలిన తొమ్మది న్యూజిలాండ్ వికెట్లు తీసి సునాయాసంగా మ్యాచ్ గెలుస్తుందనుకున్న భారత్ చివరకు 'డ్రా'తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.
అయితే రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), ఎజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) కలిసి భారత్కు చివరి వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలవగా... రెండో టెస్టు శుక్రవారం నుంచి ముంబైలో జరుగుతుంది.