రాత్రికి రాత్రి గొప్పవారు కాలేరు:
ఐసీసీ నిషేధం విధించడంపై షకీబుల్ భార్య భావోద్వేగంతో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. 'లెజెండ్స్ రాత్రికి రాత్రి గొప్పవారు కాలేరు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొన్న వారే ఆ స్థాయికి చేరుకోగరు. లెజెండ్స్కు కూడా కష్ట కాలం వస్తుంది. కానీ.. దృఢ సంకల్పం, మనో ధైర్యంతో వారు ఆ పరిస్థితులను దాటుకుంటారు. షకీబుల్ మానసిక స్థైర్యం ఏంటో తనకు బాగా తెలుసు' అని షిషిర్ పోస్ట్ చేశారు.
గతంలో కంటే బలంగా తిరిగి వస్తాడు:
షకీబుల్ కొత్త ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. గతంలో ఎన్నడూ లేనంత బలంగా తిరిగి వస్తాడు. గాయాల కారణంగా కొన్నాళ్లు క్రికెట్కు దూరమైనా.. తిరిగి ప్రపంచకప్లో ఎలాంటి ప్రదర్శన చేసాడో మనం అందరం చూసాం. ఇది కేవలం ఓ సంధి దశ మాత్రమే. షకీబుల్పై చూపుతున్న అభిమానానికి అందరికి ధన్యవాదాలు' అని షిషిర్ రాసుకొచ్చారు. షిషిర్-షకీబ్లు 2012 డిసెంబర్ 12న వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అలైనా ఉంది.
రెండేళ్ల నిషేధం సరిపోదు:
షకీబుల్కు కొందరు మద్దతు ఇవ్వగా.. మరికొందరు మండిపడుతున్నారు. 'షకీబుల్పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు. అతడు తప్పు చేశాడు. శిక్ష అనుభవించాడు. ఈ ఘటన యువ క్రికెటర్లకు ఓ పాఠం. నిబంధనలు పాటించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో అందరికి అర్ధం అయింది. షకీబుల్పై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు, ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తన ట్విటర్లో రాసుకొచ్చారు.
మూడు అభియోగాలు:
2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది.