ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఘనంగా పునరాగమనం చేశాడు. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో షకీబుల్ (4/8) బంతితో మాయ చేశాడు. దాంతో తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఫిక్సింగ్ కోసం బుకీ సంప్రదించిన విషయాన్ని సమయానికి తమ క్రికెట్ బోర్డుకు చేరవేయనందుకు షకిబ్పై 2019 అక్టోబర్లో ఏడాది నిషేధం పడ్డ సంగతి తెలిసిందే.
ముందుగా వెస్టిండీస్ 32.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. కెల్ మయేర్స్ (40; 4 ఫోర్లు, 1 సిక్స్), రోమన్ పావెల్ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు పరుగులు సాధించలేకపోయారు. షకీబుల్తో పాటు హసన్ మహముద్ 3, ముస్తఫిజుర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బంగ్లాదేశ్ 33.5 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (69 బంతుల్లో 44; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లోకి ఘనంగా పునరాగమనం చేసిన షకీబుల్ హసన్.. 19 పరుగులు కూడా చేశాడు. 43 బంతుల్లో ఒక బౌండరీ సాయంతో 19 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అకీల్ హోసిన్ బౌలింగ్లో బోల్డ్ అయ్యాడు. బ్యాట్, బంతితో మెరిసిన షకీబుల్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారం దక్కింది. ఈ మ్యాచ్తో వెస్టిండీస్ తరఫున ఆరుగురు ప్లేయర్లు, బంగ్లా జట్టులో ఒకరు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. విండీస్ అరంగేట్ర ఆటగాళ్లు అందరూ పూర్తిగా నిరాశపరిచారు.
షకీబుల్ అక్టోబర్ 2019 నుండి క్రికెట్ ఆడలేదు. 2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది. షకీబుల్ తన తప్పు అంగీకరించడంతో ఏడాది మినహాయింపు లభించింది. గత అక్టోబర్ 29తో అతని సస్పెన్షన్ ముగిసింది.
భారత్-ఆస్ట్రేలియా మైదానంలోనే పోటీదారులు.. బయట మంచి మిత్రులు: మోదీ