హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అబిమానులను సొంతం చేసుకున్న ఏబీ డివిలియర్స్ అభిమాన క్రికెటర్ ఎవరో తెలుసా? ఏబీ డివిలియర్స్ ఇష్టమైన క్రికెటర్ ఎవరో కాదు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టోర్నీ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్తో కలిసి పాల్గొన్న ఇంటర్యూలో డివిలియర్స్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
ఈ కార్యక్రమంలో డివిలియర్స్ను భారత క్రికెటర్లలో మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడగ్గా.. అందరూ విరాట్ కోహ్లీ పేరు చెబుతాడని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, డివిలియర్స్ మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ అని బదులిచ్చాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జాంటీ రోడ్స్ని అడగ్గా సురేశ్ రైనా అని చెప్పడం విశేషం.
Congratulations @ABdeVilliers17 , the most loved cricketer in the world, on a wonderful career. International cricket will be poorer without you, but you will continue to be celebrated by cricket fans around the world pic.twitter.com/uA7CBlYE9F
— Virender Sehwag (@virendersehwag) May 23, 2018
కాగా, ఏబీ డివిలియర్స్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. డివిలియర్స్ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.
ఈ వీడియోలో 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.
'ఇది చాలా కఠిన నిర్ణయం కానీ చాలా కాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్నాను.. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. క్రికెట్ దక్షిణాకాకి, నా జట్టు సభ్యులకు, దక్షిణాఫ్రికా, ప్రపంప వ్యాప్తంగా నా వెనుక ఉండి నాకు మద్దతు తెలిపిన అభిమానులకు నా ధన్యవాదాలు' అని డివిలియర్స్ తెలిపాడు.
'ఇండియా, ఆస్ట్రేలియాలపై సిరీస్లు గెలిచిన తర్వాత రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావించాను. ఇక నా సహచక క్రికెటర్లకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ల మద్దతు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు. ఇక నావల్ల కాదు అనిపించింది. నా నిర్ణయాన్ని అర్థం చేసుకునే అభిమానులకు కృతజ్ఞతలు. విదేశాల్లో ఆడే ఆలోచన కూడా నాకు లేదు. అయితే దేశీయంగా టైటాన్స్ టీమ్కు మాత్రం ఆడతాను' అని డివిలియర్స్ తెలిపాడు.
2004 డిసెంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. 2019 వరల్డ్కప్కు ముందు డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో దక్షిణాఫ్రికా జట్టుక భారీ ఎదురుదెబ్బ తగిలినట్టేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.