సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరును, నాయకత్వ లక్షణాలను ప్రపంచంలోని క్రికెటర్లందరూ ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. అయితే సమకాలీన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ కూడా కోహ్లీని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడు. కోహ్లీ రోజురోజుకు మెరుగుపడుతున్నాడని స్మిత్ పేర్కొన్నాడు. కోహ్లీ భారత్ తరఫున 416 మ్యాచ్ల్లో 21,901 పరుగులు.. 70 సెంచరీలు చేసి గత దశాబ్దంలో అత్యుత్తమ బ్యాట్స్మన్గా నిరూపించుకున్నాడు.
స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్ పోడ్కాస్ట్తో స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ చాలా కాలంగా తెలుసు. అతను 2007లో బ్రిస్బేన్లోని అకాడమీకి వచ్చాడు. ఆ సమయంలో నేను బౌలింగ్ చేస్తూ కొంత సమయం గడిపాను. ప్రారంభ రోజుల్లో మైదానంలోనే కాక బయట కూడా మాట్లాడుకునేవాళ్లం. ఒక్కోసారి జట్టుకు ఆడుతూ పోటీపడ్డాం కూడా. విరాట్ ఓ అద్భుతమైన వ్యక్తి. సమయం గడిచేకొద్దీ మరింత మెరుగుపడుతున్నాడు. అది ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది' అని విరాట్ను ఆకాశానికెత్తేశాడు.
బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా 2019 ప్రపంచకప్ జరుగుతుండగా భారత అభిమానులు స్టీవ్ స్మిత్ను గెలిచేసారు. ఫాన్స్ అలా అంటుంటే.. కోహ్లీ వద్దని సైగలు చేసాడు. దీనిపై స్మిత్ మాట్లాడుతూ... 'ప్రపంచకప్ సందర్భంగా భారతీయ అభిమానులు నన్ను గెలిచేస్తుంటే.. విరాట్ వద్దని సూచించాడు. ఆ సమయంలో నేను అతనికి ధన్యవాదాలు చెప్పాను. విరాట్ మంచి మనసున్న వ్యక్తి. మేమిద్దరం మైదానంలో కష్టపడి ఆడుతాం. జట్టుకోసం ఏం చేయడానికైనా సిద్దమే' అని స్మిత్ తెలిపాడు. మరి కొద్ది రోజుల్లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ చాలా గొప్పగా ఉంటుందని, ఆ సిరీస్ కోసం వేచి చూస్తున్నానని స్మిత్ చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదాపడి.. ఆ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరిగితే తాను కచ్చితంగా ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్న స్మిత్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తే భారత్కు ప్రయాణించేందుకు అభ్యంతరం లేదన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్-మేలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచకప్ నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
రింగ్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన అండర్టేకర్!!